ఈటలకు రాజాసింగ్, రఘునందన్ పరామర్శ.. ఏడోసారి గెలుస్తారని అని ధీమా..
అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనను పార్టీ నేతలు కలిసి పరామర్శిస్తున్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ పరామర్శించారు. ఆసుపత్రిలో ఈటల రాజేందర్ బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
ఈటల రాజేందర్ బాగానే ఉన్నారని, రేపు డిశ్చార్జి అవుతారని రాజాసింగ్ చెప్పారు. ప్రజాదీవెన పాదయాత్రను పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈటల రాజేందర్ ఏడోసారీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్లో బీజేపీ గెలుపు తథ్యం అని చెప్పారు.
ప్రజా దీవెన పాదయాత్రలో భాగంగా వీణవంకలో ఈటల రాజేందర్ నీరసించిపోయిన సంగతి తెలిసిందే. జ్వరం రావడం, ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో నిమ్స్కు తరలించాలని వైద్యులు చెప్పారు. ముందు నిరాకరించినా.. ఆ తర్వాత మరింత నీరసించిపోవడంతో నిమ్స్ వచ్చారు. తర్వాత అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
అంతకుముందు పాదయాత్రలో మాట్లాడిన ఈటల రాజేందర్.. కేసీఆర్ అహంకారం, నిరంకుశత్వం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని తెలిపారు. తనను దమ్ముంటే రాజీనామా చేయాలని కేసీఆర్ బానిసలు అడిగారని గుర్తుచేశారు. అందుకే రాజీనామా చేశానని చెప్పారు. బై పోల్లో విజయం తనదేనని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో గల గ్రామాల మీదుగా 23 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తారు.