పోలీసులతో కలిసి రాకేష్ రెడ్డి భూదందాలు ..కొనసాగుతున్న అంతర్గత విచారణ
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో నేరస్తుడికి పోలీసుల సహకారం ఉందన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రిమినల్స్ తో పోలీసులకు లింకులున్నాయన్న విషయం ఈ హత్యతో వెలుగులోకి వచ్చింది. ఒక్క చిగురుపాటి జయరాం హత్య లోనే కాకుండా, రాకేష్ రెడ్డితో కలిసి పలు భూదందాల్లో పోలీసుల ప్రమేయం ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ మర్డర్ మిస్టరీ లో ఏకంగా పదకొండు మంది పోలీసులతో రాకేష్ రెడ్డి హత్య తర్వాత మాట్లాడారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ప్రజలలో పోలీస్ శాఖపై నమ్మకం సన్నగిల్లుతోంది .
రాకేష్ రెడ్డి తో పోలీసులకు సంబంధాలు.. పోలీసులు మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు
చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాడు రాకేష్ రెడ్డి. అయితే రాకేష్ రెడ్డి రోజుకో సినిమా స్టోరీ చెబుతున్నాడని ఈ హత్యలో కొందరు రాజకీయ నాయకుల పేర్లను కూడా ఆయన వెల్లడించాడని కావాలని కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్తున్నారు ఈ కేసు విచారిస్తున్న పోలీసులు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఈ హత్యోదంతంలో పోలీసుల పాత్ర పై పోలీస్ బాస్ లు సీరియస్ గా ఉన్నారు. రాకేష్ రెడ్డి తో పోలీసులకు గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు. రాకేష్ రెడ్డి తో కలిసి పోలీసులు రియల్ ఎస్టేట్ దందా చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కూపీ లాగే ప్రయత్నంలో ఉన్నారు పోలీస్ బాస్ లు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి తో ఫోన్లో సంభాషించిన పోలీస్ అధికారుల పాత్రపై నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. రాకేష్ మొబైల్ కాల్ డేటా ఆధారంగా అతడితో మాట్లాడిన వారి వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. జయరాం హత్యకు సలహాలిచ్చారా? హత్యచేసిన తర్వాత మాత్రమే సాయం చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మంది పోలీసులపై అంతర్గత విచారణ
రాకేష్ రెడ్డి తో సంబంధం ఉన్న పోలీసుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఇదే కేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఎస్ఐ శ్రీనివాసులుపై బదిలీ వేటు పడింది. ఇన్స్పెక్టర్ రాంబాబు సహా మరో ఇద్దరు అధికారులకు రాకేశ్తో సంబంధాలున్నాయని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. రాయదుర్గం ఎస్ఐ రాంబాబుపై బదిలీ వేటు పడింది. ఆయనను సాయుధ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నేపథ్యంలో మొత్తంగా ఐదుగురిపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మొత్తం 11 మంది పోలీసులతో రాకేష్ రెడ్డి కి సంబంధాలు ఉన్న నేపథ్యంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
రాకేశ్ రెడ్డి తో కలిసి భూదందాలు .. భారీగా నజరానాలు
రాకేష్ రెడ్డి తో కలిసి పోలీసులు ల్యాండ్ సెటిల్మెంట్ లకు పాల్పడేవారని విచారణలో తేలింది. హైదరాబాద్ శివార్లలో ల్యాండ్ సెటిల్మెంట్ లు చేస్తూ రాకేష్ రెడ్డి పోలీసులకు భారీగా నజరానాలు ముట్ట చెప్పేవాడని ఆసక్తికరమైన విషయాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి. రాకేష్ రెడ్డి తో కలిసి పోలీసుల రియల్ ఎస్టేట్ దందా చాలా కాలంగా సాగుతుందని గుర్తించారు. గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి, హయత్నగర్, ఆదిభట్ల, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరిగినట్టు పోలీసులు కనుగొన్నారు. ఖాళీ స్థలాలపై వివాదాలు సృష్టించి పోలీసులతో బెదిరింపులకు దిగేవాడని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ దందా పేరుతో పలువురు వ్యాపారులకు రాకేష్ రెడ్డి టోకరా ఇచ్చినట్టు తెలుస్తోంది. బాగా డబ్బులున్న వ్యాపారులను పోలీసులతో కలిసి బెదిరించేవాడని దర్యాప్తులో తేలింది.రాకేష్రెడ్డితో సంబంధం ఉన్న పోలీసులపై విచారణ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. పోలీస్ శాఖ పరువును నిలువునా తీస్తూ నేరస్తులకు సహకరిస్తూ, ఈ తరహా దందాలకు పాల్పడుతున్న పోలీసులపై ఉక్కుపాదం మోపకుంటే పోలీస్ శాఖ మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుంది.