రామప్పకు యునెస్కో ప్రపంచ వారసత్త హోదా ప్రకటన ఎల్లుండే..? మంత్రి శ్రీనివాస్ గౌడ్
రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా వచ్చే అవకాశం ఉన్నదని పర్యాటక, శాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రంలో గల చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. రామప్పకు వారసత్వ హోదా వస్తే పర్యాటకంగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నిన్న రవీంధ్ర భారతీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క రోజులో పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్కు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పాలంపేటలోని చారిత్రక రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశం దగ్గర పడింది. ఈ నెల 25న పారిస్లో జరిగే ఎంపిక కమిటీ తుది సమావేశంలో రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించే అవకాశం ఉందని శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రామప్పను వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించాలనే భారతదేశ వినతులను ఈ కమిటీ పరిశీలించిందని చెప్పారు. తర్వాత ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
రామప్ప ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే యునెస్కోలోని భారత ప్రతినిధికి పంపినట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రామప్ప చరిత్రపై ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని, బ్రోచర్లను అందజేసినట్టు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
Recommended Video
కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. ఇదీ ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలో గల పాలంపేట అనే గ్రామంలో ఉంది. రామప్పను రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఆలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెబుతారు. ఆలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.