రామప్పకు యునెస్కో గుర్తింపు, తదుపరి హైదరాబాదే: మంత్రి కేటీఆర్
రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం హర్షణీయమని తెలిపారు. ఈ శుభవార్తను అందరితో పంచుకోవడం ఆనందాన్నిస్తోందని వివరించారు. తెలంగాణ నుంచి ఇదే తొలి ప్రపంచ వారసత్వ కట్టడం అని వెల్లడించారు.
రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇక రాజధాని హైదరాబాద్కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే తమ తదుపరి లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాలు పంచుకున్నారు.
కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. ఇదీ ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలో గల పాలంపేట అనే గ్రామంలో ఉంది. రామప్పను రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఆలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెబుతారు. ఆలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.