భయంకరమైన శిక్ష: రామతీర్థం ఉదంతంపై జగన్ సర్కార్కు చిల్కూర్ బాలాజీ అర్చకుల అల్టిమేటం
హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్నఉదంతం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఘటన కలకలం రేపింది. 400 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న రామతీర్థంలో ప్రతిష్ఠించిన శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం, తలను వేరు చేసి.. కోనేటిలో పడేసిన ఘటన పట్ల తెలుగు ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది.
Recommended Video
రామతీర్థం ఉదంతంపై తెలంగాణలోని చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ స్పందించారు. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్మార్గులకు భయంకరమైన శిక్షను విధించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రాథమిక హక్కులను కాపాడటానికి దేశంలో రాజ్యంగ వ్యవస్థ అమల్లో ఉందని, వారిని కాపాడటానికి ఇండియన్ పీనల్ కోడ్ వంటి చట్టాలు ఉన్నాయని, గుడిలో వెలిసిన దేవతలను రక్షించే చట్టాలు మాత్రం భారత్లో లేవని గుర్తు చేశారు. అలాంటి చట్టాలను తీసుకుని రావడానికి తాము పోరాడుతున్నామని అన్నారు.
వీలైనంత త్వరగా రాములవారి విగ్రహాన్ని రామతీర్థంలో పునఃప్రతిష్ఠింపజేయాలని రంగరాజన్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. ఈ విషయంలో జాప్యం చేయడం మంచిది కాదని సూచించారు. మంచిరోజు అని చూడకుండా.. ముహూర్తం కోసం వేచి చూడకుండా.. ఈ రెండు మూడురోజుల్లోనే స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని అన్నారు. కొందరు మూర్ఖులు విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల హిందువులు, హైందవ సమాజాన్ని భయపెట్టాలనుకుంటున్నారని చెప్పారు.
దేశ చరిత్రలో వందల ఏళ్ల కిందట దేవాలయాలు, విగ్రహాల విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయని, అయినప్పటికీ.. హైందవ సంప్రదాయం చెక్కు చెదరలేదని అన్నారు. రామచంద్రుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనను రాజకీయాల కోసం వాడుకోవడానికి నాయకులు ప్రయత్నించడం సరికాదని చెప్పారు. రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం వినియోగించుకోవాల్సిన సందర్భం కాదని హితవు పలికారు. రాజకీయ దురుద్దేశంతో కాకుండా.. రామనామ కీర్తనలతో రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని సూచించారు.