పోలీస్ కీచకపర్వంపై రాములమ్మ గుస్సా.. సర్కార్కు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్ : పోలీసుల కీచకపర్వంపై రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సమాజం తలవంచుకునేలా ఉందని మండిపడ్డారు విజయశాంతి. విద్యార్థుల పట్ల ఖాకీలు అనుచితంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ రాజ్యంలో పోలీసుల పనితీరు ఇలాగే ఉంటుందా అని మండిపడ్డారు. ఈ మేరకు తన ఫేస్బుక్లో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ .. కామెంట్ రాశారు..
ప్రభుత్వ వైఖరి ఇదేనా ??
విద్యార్థినుల పట్ల పోలీసుల తీరుతో మహిళలు, స్టూడెంట్స్ పట్ల ప్రభుత్వ వైఖరి అర్థమైందన్నారు విజయశాంతి. ఇదివరకు ఇంటర్ విద్యార్థుల జీవితాలతో .. అటవీశాఖకు చెందిన మహిళ ఉద్యోగిపై అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు దాడులతో ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తుందని ప్రశ్నించారు. దాని తర్వాత విద్యార్థినులపై పోలీసులు దాడుల చేయడం హేయనీయమని ఖండించారు. ఈ ఘటనను యావత్ సమాజం తప్పుబడుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
మాటలేనా ..?
హైదరాబాద్లో మహిళల భద్రత కోసం షీ టీంలు ఏర్పాటు చేశామని బీరాలు పోతున్న సీఎం కేసీఆర్ .. మహిళ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇది ఇలా ఉంటే ప్రతిపక్షాల విమర్శలు, వాదనలు పట్టించుకోబోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. మహిళల నుంచి తిరుగుబాటు వస్తే ప్రభుత్వానికి దిమ్మతిరుగుతుందని హెచ్చరించారు.
ఇదీ విషయం ..
చార్మినార్ వద్ద గల యునాని ఆస్పత్రిని ఎర్రగడ్డకు తరలిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిని నిరసిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళనకు దిగారు. బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వారిని అదుపులోకి తీసుకునే చర్యల్లో భాగంగా ఖాకీలు కీచకంగా ప్రవర్తించారు. విద్యార్థినులపై కానిస్టేబుల్ పరమేశ్, ఏసీపీ ఆనంద్ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఓ విద్యార్థిని కానిస్టేబుల్ పరమేశ్ తొక్కగా .. ఆమె అరిచింది. అంతటితో ఆగకుండా గిల్లీ పైశాచిక ఆనందం పొందాడు. దీనిని ఓ విద్యార్థి వీడియో తీసి షేర్ చేయడంతో పోలీసులపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసు బాసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జరిగిన ఘటనకు సంబంధించి పరమేశ్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని డీసీపీ అంబర్ కిశోర్ ఝాను ఆదేశించారు.