కేసీఆర్పై రాములమ్మా గరం గరం.. కరోనా కంటే డేంజర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు
గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార పర్వం పీక్కి చేరింది. బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో కేసీఆర్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. దీనిపై కౌంటర్లు వస్తున్నాయి. ఫైర్ బ్రాండ్, రాములమ్మ విజయశాంతి ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.
తాను బక్క జీవినని, తనను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీఎం మాటలు వింటుంటే.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ కూడా.. కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవినైన తనను అంతం చేయడానికి ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా అని అడిగినట్టు ఉందన్నారు.
తెలంగాణకు కరోనా కంటే కేసీఆర్ ప్రమాదకరంగా మారారని విజయశాంతి అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి చేసే ప్రయత్నాలను సీఎం తప్పుపట్టడం కొత్తేమీ కాదన్నారు. దుష్టశక్తిని తుదముట్టించాలంటే దైవ శక్తులన్నీ కలసి భీకర పోరాటం చేయాలని, అప్పుడే మంచి ఫలితం వస్తుందని విజయశాంతి అన్నారు. గ్రేటర్ మేయర్ పదవీని ఇతర పార్టీలకు కట్టబెడితే భూమి తలకిందులైపోతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అభివృద్ధి ఆగిపోతుందని.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. ఏ పార్టీలను ఉద్దేశించి అలా అన్నారో గానీ, ఆయన మాటలే నిజమైతే.. జాతీయ పార్టీలు వరుసగా అనేకసార్లు విజయాలు సాధించిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి అని అడిగారు. అభివృద్ధి జరగడం వల్లే కదా.. అక్కడి ప్రజలు ఆ పార్టీలకే తిరిగి పట్టం కడుతున్నారు అని చెప్పారు. కేసీఆర్ కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే మళ్లీ ఆ పార్టీలకు అధికారం ఎలా దక్కుతుందంని విజయశాంతి ప్రశ్నించారు.