48 గంటల్లో టీఎస్ఆర్టీసీ సమ్మె..!! విలీనంపై కార్మికుల బెట్టు, టైం ఇవ్వాలంటున్న కమిటీ
రెడీ 1,2,3.. మరో 48 గంటల్లో తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతుంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సహా 11 డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె సైరన్ తప్పదని కార్మిక సంఘం నేతలు స్పష్టంచేస్తున్నారు. మరోవైపు ఐఏఎస్ కమిటీ మరోసారి కార్మిక సంఘం నేతలతో చర్చలు జరిపారు. డిమాండ్లపై చర్చించడానికి సమయం కావాలని, దసరా పండుగ సందర్భంగా సమ్మె చేస్తామనే అంశంపై వెనక్కి తగ్గాలని కోరారు. కానీ ఆర్టీసీ కార్మిక నాయకులు మాత్రం ఆర్టీసీ విలీనంపైనే బెట్టు చేస్తున్నారు.
ఇక బస్టాండ్లలో మినీ థియేటర్లు..! ప్రయాణికులను ఆకర్షించే యత్నంలో టీఎస్ఆర్టీసీ..!!
సమ్మెకు 5 సంఘాలు
తెలంగాణ మజ్దూర్ యూనియన్ సహా మరో నాలుగు గుర్తింపు పొందిన సంఘాలు ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మె చేస్తామని అల్టిమేటం జారీచేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. కార్మిక సంఘం నేతలతో చర్చలు జరిపేందుకు ఐఏఎస్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఇవాళ మరోసారి చర్చించారు. ఆర్టీసీ విలీనం, 11 డిమాండ్లపైనే కార్మిక సంఘం నేతలు బెట్టు చేస్తున్నారు.
విలీనమే ప్రధానం
ఐఏఎస్ కమిటీతో చర్చలు అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం అంగీకరించాలని తేల్చిచెప్పారు. లేదంటే సమ్మె సైరన్ తప్పదని స్పష్టంచేశారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం వేసే కమిటీలపై తమకు నమ్మకం లేదని అశ్వద్ధాతమరెడ్డి స్పష్టంచేశారు.
దసరా నేపథ్యంలో
సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ జేఏసీని ఐఏఎస్ కమిటీ కోరింది. దసరా పండగ సందర్భంగా రద్దీ ఉంటుందని గుర్తుచేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సమ్మెను వాయిదా వేయాలని విన్నవించారు. అయితే తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తే తప్ప.. సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గబోమని అశ్వద్ధామరెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఐఆర్, డీఆర్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ఐఆర్, డీఆర్ వెంటనే ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐదేళ్లుగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని గుర్తుచేశారు. రూ.5 వేల కోట్ల పైచిలుకు నష్టాలతో ఉందని తెలిపారు. నష్టాలను వెంటనే పూడ్చాలని కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో 7 వేల మంది కార్మికులు పదవీ విరమణ చేశారని గుర్తుచేశారు. కొత్తగా ఉద్యోగాలను నియమించడం లేదని .. దీంతో ఉన్నవారిపై పనిభారం పడుతుందన్నారు. కానీ కార్మికుల సమస్యలను కార్పొరేషన్ పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీలో సమ్మె సైరన్ తప్పదని అర్థమవుతోన్న వేళ.. ప్రత్యామ్నాయా ఏర్పాట్లలో ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. దసరా సందర్భంగా ప్రైవేట్ సిబ్బంది బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది.