విజృంభిస్తున్న 'రియల్' మాఫియా..! హెచ్ఎండీఎ కమిషనర్ "బలి"..?
హైదరాబాద్ : రియల్ మాఫియా పంజా విసురుతోందా? అడ్డొచ్చిన అధికారులపై ప్రతాపం చూపిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ కమిషనర్ జనార్ధన్ రెడ్డిని బలి చేయడం వెనుక కుట్ర ఉందనే చర్చ జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెనుకేసుకురావడానికి.. ప్రభుత్వ పెద్దలు ఆయనపై బదిలీ వేటు వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకనాడు ట్రబుల్ షూటర్ గా ప్రభుత్వ మెప్పు పొంది, సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్న జనార్ధన్ రెడ్డిని ఈనాడు పక్కన ఎందుకు పెడుతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కాకా రాజేసిన కోకాపేట..!
నిజాయతీపరుడునే బ్రాండున్న జనార్ధన్ రెడ్డిని అర్ధాంతరంగా బదిలీ చేయడం చర్చానీయాంశంగా మారింది. కోకాపేట భూముల వివాదమే ఆయన పదవికి ఎసరు తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేస్తున్న ఆయనను అసెంబ్లీ ఎన్నికలకు ముందు హెచ్ఎండీఏ కమిషనర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. అక్కడ ఆయన బాధ్యతలు స్వీకరించి 5 నెలలే అవుతోంది. అంతలోనే బదిలీ చేయడంపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. కోకాపేటలోని 4వేల కోట్లకు పైగా విలువైన భూముల్ని.. 50 శాతం తక్కువ ధరకు కొట్టేయాలనే స్కెచ్ తో కొందరు పెద్దలు జనార్ధన్ రెడ్డిని బలి చేశారనే టాక్ నడుస్తోంది. ఆయనపై వత్తిడి పెట్టినా.. ఏమాత్రం వారికి సపోర్ట్ ఇవ్వకపోవడంతోనే బదిలీ కుట్ర జరిగినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
166 ఎకరాలకు సంబంధించిన కోకాపేట భూములను అప్పట్లో వేలం వేశారు. కొందరు ఆ భూముల కోసం అప్పుడే 687 కోట్లు చెల్లించారు. అయితే కోర్టు వివాదాల నేపథ్యంలో అది పెండింగ్ పడింది. మధ్యలో తమ డబ్బులు తమకివ్వాలంటూ వారు హెచ్ఎండీఏ అధికారులను కోరారు. మొత్తానికి కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో ఆ భూములను అమ్మే విషయం తెరపైకి వచ్చింది. అప్పట్లో దాదాపు 13 కోట్ల రూపాయలు పలికిన ఎకరం ధర.. ప్రస్తుతం 20 కోట్లకు పైగానే పలుకుతోందట. దీంతో ఆ భూములను పాత ధరకే అమ్మేలా... అప్పట్లో డబ్బులు కట్టిన వ్యక్తులు పెద్దస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు వినికిడి. కొత్త ధర ప్రకారం కోకాపేట భూముల విలువ 4వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందనేది అంచనా. పాత ధర ప్రకారమైతే వారు మరో వెయ్యి కోట్ల వరకు చెల్లిస్తే సరిపోతుంది. దీంతో దాదాపు 2500 కోట్ల రూపాయలు అదనంగా వారికి లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న జనార్ధన్ రెడ్డి అడ్డుపడ్డారని తెలుస్తోంది. అయితే కొందరు పెద్దలు రంగంలోకి దిగి ఆయనపై తీవ్రంగా వత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయినా కూడా ససేమిరా అనడంతోనే జనార్ధన్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించారనే గుసగుసలు జోరందుకున్నాయి.
ఆ కారణంతోనా..! లేదంటే?
అమెరికా పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చేంతలోపే జనార్ధన్ రెడ్డిపై వేటు పడింది. సోమవారం రాత్రి ఆయన నగరానికి చేరుకున్నారు. అంతలోపే అంటే మధ్యాహ్నమే ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన స్థానంలో మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే హెచ్ఎండీఏ కమిషనర్గా జనార్ధన్ రెడ్డి బదిలీ వ్యవహారం ఒకవైపు దుమారం రేపుతుంటే.. మరోవైపు ఆయనకు ప్రభుత్వంలో కీ రోల్ కల్పించేందుకే ఈ నిర్ణయమనేది మరో వాదన.