యాదాద్రిలో కేసీఆర్ , కారు , సర్కారు చిత్రాల తొలగింపు ... ప్రతిపక్షాల ఆందోళనలకు చెక్
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గులాబీ ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షపార్టీలు కేసీఆర్ సర్కార్ పై దుమ్మెత్తిపోశాయి . ఇక రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చెయ్యాలని , పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. వివాదాస్పద చిత్రాలను తొలగించకుంటే హిందూ సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు . ఇక దీంతో అష్టభుజి ప్రాకార మంటప రాతిస్తంభాలపై వివాదాస్పద చిత్రాలను శిల్పులు పూర్తిగా తొలగించారు.
వినాయక మండపంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం .. మరో వివాదంలో గులాబీ పార్టీ
సీఎం కార్యాలయం నుండి శనివారం జారీ చేసిన ఆదేశాలతో దేవాలయ ప్రాకారాలపై, శిలలపై దైవిక సంబంధిత బొమ్మలు మినహా మిగతా అన్ని రకాల చెక్కడాలను చెరిపేసినట్లు వైటీడీఏ ప్రధాన స్థపతి ఆనందచారి వేలు తెలిపారు. ఇక అంతే కాదు ఆలయ ప్రాకార మంటపంలో రాజకీయ అంశాలకు చెందిన బొమ్మల చెక్కడంలో ఎవరి ప్రమేయం లేదని, ఒక శిల్పి తన సొంత నిర్ణయంతో చేశారని ఆయన వెల్లడించారు. ఇక యాదాద్రి ఆలయంపై వివాదానికి దారి తీసిన చిత్రాలను తొలగించామని, పూర్తిగా దైవ సంబంధిత చిత్రాలను మాత్రమే చెక్కిస్తామని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, తొలగించిన బొమ్మల స్థానంలో లతలు, పద్మాలు, హంసలతో పాటు దైవ సంబంధిత బొమ్మలను చెక్కడానికి మార్కింగ్లైన్లు వేసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఆలయ శిల్పులు .
సీఎం కేసీఆర్ చిత్రం ఉన్న చోట సుదర్శన చక్రం, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు స్థానంలో హంసను చెక్కనున్నారు స్థపతులు . కేసీఆర్ కిట్, తెలంగాణకు హరితహారం, తెలంగాణ మ్యాప్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ, చార్మినార్, పీర్ల బొమ్మలను తొలగించిన శిల్పులు వాటి స్థానంలో దైవిక సంబంధమైన ఆకృతులు , పద్మాలు, లతలు, హంసల వంటి ఇతర ఆకృతుల స్కెచ్లు గీశారు. వీటి పనులను ప్రారంభిస్తామని స్థపతులు స్పష్టం చేశారు. నిన్నటి వరకు యాదాద్రిలో శిలలపై టిఆర్ఎస్ పార్టీ ప్రచారం పై భగ్గుమన్న ప్రతిపక్ష పార్టీలు దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కార్యచరణ రూపొందించే పనిలో పడ్డాయి. ఇక ప్రతిపక్షాలకు చెక్ పెడుతూ, ఆ అవకాశం లేకుండా కెసిఆర్ సర్కార్ యాదాద్రిలో వివాదాస్పదంగా ఉన్న చిత్రాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో శిల్పులు వాటిని తొలగించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా అయింది.