10 లక్షల మంది పరేషాన్ - కేంద్రం చెప్పినా ఆర్మీ వినదా? - రక్షణ మంత్రికి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్ల మూసివేత ఆంక్షల్ని ఎత్తివేయాలని మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. ఈ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం రక్షమంత్రికి ఎంపీ లేఖ రాశారు. కంటోన్మెంట్ పరిధిలో 20కిపైగా రోడ్లను మూసేయడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, విధి విధానాలు పాటించకుండా, కనీసం కంటోన్మెంట్ బోర్డుకు కూడా చెప్పకుండా స్థానిక మిలటరీ అధికారులు (ఎల్ఎంఏ) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆక్షేపించారు.
మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సుమారు 10 లక్షల మందికి అసౌకర్యంగా మారిన రోడ్ల మూసివేతపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పందించిందని, రోడ్ల మూసివేతపై ఆంక్షలు ఎత్తేయాలంటూ రక్షణ శాఖ ఆదేశాలు కూడా జారీ చేసిందని, అయితే, సికింద్రబాద్ కంటోన్మెంట్ అధికారులు మాత్రం సదరు ఆదేశాలను పెడచెవిన పెట్టారని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. రోడ్లు తెరిచేలా వెంటనే చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రిని కోరారు. కంటోన్మెంట్ రోడ్లను తెరవాలంటూ గతంలో కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రతులను కూడా రేవంత్ రెడ్డి తన లేఖకు జతచేశారు.
సికింద్రబాద్ కంటోన్మెంట్ ఏరియా నుంచి మల్కాజ్ గిరి, ఈసీఐఎల్, సఫిల్ గుడ, రిసాల బజార్, బొల్లారం బజార్, లాల్బజార్ తదితర ప్రాంతాలకు మార్గాలున్నాయి. వీటిని ఆర్మీ అధికారులు తరచూ మూసివేస్తుండటంతో లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మీ అధికారుల తీరు వివాదాస్పదంగా ఉందంటూ అన్ని రాజకీయ పార్టీలూ కేంద్రానికి వినతులు సమర్పించాయి. గత నెలలో తెలంగాణ మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ సైతం కంటోన్మెంట్ రోడ్లు తెరవాలంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు లేఖ రాశారు.
Recommended Video
మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల మూసివేతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులోనూ గత నెలలో ఓ పిటిషన్ దాఖలైంది. సీనియర్ సిటిజన్ అనూప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు త్వరలోనే విచారించనుంది. ఏఓసీ రోడ్లు సహా మిలటరీ అధికారులు మూసేసిన పలు రోడ్లు 100 ఏళ్లకు పైగా స్థానిక ప్రజలు వినియోగిస్తున్నవే కావడం గమనార్హం.