మహిళ మరణంతో అప్రమత్తం: మెట్రో స్టేషన్లకు మరమ్మతులు, ఫ్లడ్లైట్ల వెలుగులో..!
హైదరాబాద్: ఇటీవల నగరంలోని అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్లో పెచ్చులూడి మీదపడటంతో ఓ వివాహిత ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెట్రో నిర్మాణ లోపాలపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అసలు మెట్రో స్టేషన్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిందా? ఇలానే మరికొందరి ప్రాణాలు తీస్తారా? అంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
10 స్టేషన్లలో మరమ్మతులు
ఈ నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలను కమిషన్ ఆఫ్ మెట్రో రైలు సేఫ్టీ(సీఎంఆర్ఎస్) ప్రత్యక్షంగా పరిశీలించింది. మిగిలిన అన్ని స్టేషన్లపై సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వం, సీఎంఆర్ఎస్ ఆదేశాలతో అన్ని మెట్రో స్టేషన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మెట్రో స్టేషన్లలో నిర్మాణ పరమైన లోపాల సవరణపై ఎల్అండ్టీ మెట్రో దృష్టి సారించింది. ఇప్పటి వరకు 10 మెట్రో స్టేషన్లలో లోపాలను గుర్తించి వాటిని సరిచేసింది. ఇప్పటి వరకు గుర్తించిన మెట్రో స్టేషన్లలో మరమ్మతులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఫ్లడ్ లైట్ల వెలుతురులోనే..
ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి తర్వాత ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బూమ్లిఫ్ట్ ఉపయోగించి మరమ్మతులు చేస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ప్రతి స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో తాము ఏమాత్రం రాజీపడమని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ స్టేషన్లకు మరమ్మతులు
కాగా, ఇప్పటి వరకు లోపాలు గుర్తించిన 10 స్టేషన్లలో పూర్తిగా మరమ్మతులు చేసినట్లు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టేషన్ గ్రిడ్ ‘ఏ' కుడివైపు బయటి భాగంలో లూజ్ ప్లాస్టర్ సామాగ్రిని గుర్తించి తొలగించారు. తార్నాక, మూసాపేట స్టేషన్లలోనూ లోపాలను గుర్తించి సవరించారు. ఎల్బీనగర్ స్టేషన్ మెట్ల మార్గంపైన పగుళ్లు ఏర్పడ్డాయి. వీటిపై సిమెంట్ పూత వేశారు. న్యూమార్కెట్ స్టేషన్ ‘బీ'వైపు కాన్కోర్స్ అంతస్తులో లూజ్ మెటీరియల్స్ గుర్తించి తొలగించారు. గ్రిడ్ ‘ఏ' కుడివైపు వేలాడుతున్న ఫైవుడ్ను తొలగించారు.
తరచూ సమీక్షలు
బాలానగర్ మెట్రో స్టేషన్ ‘బీ'వైపు గోడ ప్లాస్టర్ పగుళ్లు రావడంతో వాటిని పూడ్చారు. రసూల్పురా స్టేషన్ ‘సీ' వైపు గోడ ఇటుకలు వేలాడుతుండటంతో వాటిని తొలగించి, బిగించారు. పరేడ్ గ్రౌండ్ స్టేషన్ ‘ఏ' వైపు రెయిలింగ్ గోడ వద్ద కాంగ్రీటు లేచి ప్రమాదకరంగా మారడంతో.. దాన్ని పూడ్చివేశారు. హైటెక్ సిటీ స్టేషన్ లెడ్జ్ స్లాబ్ చివర్లో ప్యాచ్ లు వదులు కావడంతో వాటిని తొలగించి పూతవేశారు. గాంధీభవన్ స్టేషన్ గ్రిడ్ ‘కె' మెట్ల ప్రాంతంోల లూజ్ కాంగ్రీటును గుర్తించి, తొలగించారు. అంతేగాక, తరచూ మెట్రో స్టేషన్ల లోపాలపై సమీక్ష నిర్వహిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు చర్యలు చేపడతామని చెప్పారు.