కేసీఆర్ కు "రిటైర్మెంట్ అభినందనలు".. ఖానాపూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు అలా అర్థమైనట్లా?
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖానాపూర్ మాటలు కాంగ్రెస్ నేతలకు వరంలా మారాయి. సందట్లో సడేమియా లాగా అస్త్రంలా వాడుకుంటున్నారు. గెలిపిస్తే గట్టిగా పనిచేస్తాం లేదంటే ఇంటి దగ్గర పండుకొని రెస్ట్ తీసుకుంటామన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి.. కేసీఆర్ కు "రిటైర్మెంట్ అభినందనలు" తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు డిసెంబర్ 11 తర్వాత "కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోవడం", "కేటీఆర్ అమెరికాకు పోవడం" ఖాయమంటూ వ్యాఖ్యానించడం చర్చానీయాంశమైంది.
కేసీఆర్ తన ఫ్యామిలీ కోసమే ప్రభుత్వం నడుపుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకే ఆ కుటుంబ పాలన నుంచి బయటపడాలంటే ఇదే సరైన సమయమని అన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు, హామీలు గాలికి వదిలేశారని ఆరోపించారు. గిరిజనులకు, మైనార్టీలకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు.
రిటైర్మెంట్.. కాంగ్రెస్ ప్రచారాస్త్రం
ఖానాపూర్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గెలవకుంటే ఇంటికి పోతామనే రీతిలో మాట్లాడిన కేసీఆర్ తీరు వారిలో నూతనోత్సాహం కలిగిస్తోంది. మహాకూటమి ప్రభంజనం ఒకవైపు.. ఓటమి భయం మరోవైపు.. అందుకే కేసీఆర్ అలా వ్యాఖ్యానించారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తానికి కేసీఆర్ కుటుంబ పాలన ముగిసినట్లేనని ఆనందపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉందని.. అది మహా కూటమికి కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. అది తెలిసే కేసీఆర్ ఇలా రిటైర్మెంట్ గురించి మాట్లాడారనేది కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్న టాక్.
అధికారం మాదే.. కాంగ్రెస్ ధీమా
డిసెంబర్ 12న మహాకూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ ను రాజకీయంగా సమాధి చేయాల్సిన సమయమొచ్చిందని వ్యాఖ్యానించారు. అబద్దాల కోరు, మోసగాడు అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ క్యాడర్ కేసీఆర్ తీరుపై విసుగుచెందారని.. అలాంటివారు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానం పలుకుతామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. టీఆర్ఎస్ కు ఓటమి ఖాయమనే విషయం తాము చెప్పడమే కాదు జాతీయ సర్వేలు కూడా అదే విషయం చెబుతున్నాయని అన్నారు. అందుకే ఇక రాజకీయాలు వద్దు రెస్ట్ తీసుకుంటా అనే మాటలు కేసీఆర్ నోటి వెంట వస్తున్నాయని కౌంటరిచ్చారు.
రాజకీయాల్లో ఉన్నది ప్రజాసేవ కోసం కాదా.. జీవన్ రెడ్డి కౌంటర్
జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కేసీఆర్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సొంత ఆస్తిలా భావిస్తున్నారని ఆరోపించారు. ఓట్లేస్తే అధికారంలో ఉంటా.. లేదంటే ఫామ్ హౌజ్ లో పంటానంటూ కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆయన అలా అంటుంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అధికారం కోసమే ఆశపడుతోందనే విషయం అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతో.. ప్రతిపక్ష హోదాలో కొనసాగే మనోధైర్యం లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తండ్రేమో రెస్ట్ తీసుకుంటానని.. కొడుకేమో సన్యాసం తీసుకుంటానని చెబుతుండటం చూస్తే వారిలో ఓటమి భయం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.