కేసీఆర్ ఖర్చుపై రేవంత్ రెడ్డి లాజిక్..! అదిరిపోయే రహస్యాలు చెప్పిన మల్కాజిగిరి ఎంపీ..!!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వాస్తు పిచ్చి రాష్ట్ర ప్రజల కొంప ముంచుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి భారీ అప్పులున్నాయని, డబ్బుల్లేక అన్ని డబుల్ బెడ్ రూంలు ఆగిపోయాయని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అనేక ఇతర చెల్లింపులు ఆపి బిల్లులు ఇచ్చినా ఇంకా సగం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని రుజువులు చూపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. చాలామంది కాళేశ్వరం పూర్తయ్యింది అనే భ్రమలో ఉన్నారని, కాళేశ్వరం అంటే 8 ప్రాజెక్టుల సమాహారమని, అందులో కేవలం 35 శాతం ప్రాజెక్టు కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రావు బ్రహ్మాండమైన అసెంబ్లీ, సచివాలయం పెట్టుకుని వందల కోట్లతో కొత్తవి కట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని, దీనిపై ప్రజల్లో చాలా వ్యతిరేకత వ్యక్తమవుతోందని కాంగ్రెస్ చెప్పుకొస్తోంది. కాంగ్రెస్ హైకోర్టులో పిటిషను కూడా వేసింది. తీర్పు అనుకూలంగా వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే దీని గురించి రేవంత్ రెడ్డి ఓ సంచలన నిజం బహిర్గతం చేసారు.
భవంతుల లెక్కలు బట్టబయలు..! లెక్కల రహస్యాలు చెప్పిన రేవంత్ రెడ్డి.!!
తెలంగాణ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయం, 100 కోట్ల రూపాయలతో కొత్త అసెంబ్లీలను కట్టాలని నిర్ణయించినట్లు తెలిసిందే కదా. అయితే, ఇవి దొంగలు లెక్కలు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చెప్తున్నట్లు కొత్త సచివాలయానికి 400 కోట్ల రూపాయలు కాదని, 2,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మొదట ఏదైనా తక్కువ చెప్పి జనాలను ఒప్పిస్తారని, తర్వాత అంచనాలను పెంచేస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఆయన వివరించారు.
ముందుగా తక్కువ చెప్తారు..! తర్వాత కేసీఆర్ అంచానలు పెంచేస్తారన్న కాంగ్రెస్..!!
20,000 కోట్ల రూపాయల అంచనాలతో మొదలు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రస్తుతం 40 వేల కోట్ల రూపాయలకు తీసుకెళ్లారు. 40 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని చెప్పిన కాళేశ్వరం ఇపుడు 1.20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకునేలా చేశారు. ఈ లెక్కన ఇప్పుడు జనాన్ని ఒప్పించడానికి 400 కోట్ల రూపాయలతో కడతామంటున్న సచివాలయం కూడా పూర్తయ్యే సరికి 2,000 కోట్ల రూపాయలకు చేరడం ఖాయమని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇది నిజం కావచ్చు. ఎందుకంటే ముందే ఎక్కువ చెబితే చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మధ్యలో పెంచితే ప్రజలు, కోర్టులు ఆపమని చెప్పలేవు కాబట్టి ముందు తక్కువ అంచనాలు చూపిస్తారు. ప్రస్తుతం ఈ కోణంలో చూస్తే తెలంగాణ ప్రజలను చంద్రశేఖర్ రావు మోసం చేస్తున్నట్టే నిర్దారణ జరుగుతోందని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు.
ప్రజా సమస్యలు పట్టని కేసీఆర్..! భ్రమలు కలిగిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం..!!
2014 మెదక్ జిల్లా మాసాయి పేట బస్సు ప్రమాదంలో 13 మంది అమాయకులైన పిల్లలు బలయ్యారు..కనీసం వాళ్ళను పరామర్శించటానికి ఫాం హౌస్ నుంచి బయటకు రాని సీఎం ఉంటె ఎంత లేకపోతే ఎంతని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. మూడేళ్లనుంచి సెక్రటేరియట్ కు రాకుండా కేవలం తను నిర్మించుకున్న గడి నుంచే పాలన అందిస్తున్న సీఎం చంద్రశేఖర్ రావని ఎద్దేవా చేసారు. ఖమ్మం జిల్లాలో తాము పండించిన పంటకు మద్దతు ధర అడిగినందుకు ధర్నా చేసిన రైతులకు బేడీలు వేసిన సీఎం తన కఠినత్వాన్ని చాటుకున్నారని మండిపడ్డారు.
రైతు సమస్యలు గాలికొదిలేసారు..! గులాబీ పార్టీ పై ద్వజమెత్తిన రేవంత్ రెడ్డి..!!
కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన అమాయకులైన 40 మందిని పరామర్శించకుండా ఫాం హౌస్ లో గడిపిన సీఎం పై ద్వజమెత్తారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి అసువులు బాసిన అమాయకులైన విద్యార్థులను పరమార్శించక పోగా పక్క పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో ఉన్న సీఎం తీరు ఆక్షేపనీయమన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర రాజధానిలో నడీ రోడ్డు మీదనే వరుస హత్యలు జరుగుతుంటే శాంతి భద్రతలు గాలికొదిలేసారని ముఖ్యమంత్రిపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈవన్నీ ప్రజల్లో చర్చ జరగకుండా ఉండాలనే కొత్త భవనాలంటున్నరని పీఎం చంద్రశేఖర్ రావు పై మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి.