బస్తీ మే సవాల్: కేటీఆర్కు రేవంత్ రెడ్డి ఛాలెంజ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. టీఆర్ఎస్- కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూకట్పల్లిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ రేవంత్రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్, మోదీ ఒకే నాణేనికి బొమ్మాబొరుసు అని విమర్శించారు. ఐటీఐఆర్ రాలేదని కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఆ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర ఆమరణ దీక్ష చేద్దామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
కేటీఆర్కు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అంటే కేసీఆర్కు చలి జ్వరమని సెటైర్లు వేశారు. లక్షా 91వేల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని రేవంత్ రెడ్డి అడిగారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోడీతో ఎందుకు జతకట్టాడో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్- బీజేపీ చెప్పేదీ ఒకటి చేసేదీ మరొకటి అని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను రేవంత్ రెడ్డి కోరారు. టీఆర్ఎస్- బీజేపీని గెలిపించొద్దని పిలుపునిచ్చారు. ఒకవేళ వారికి అవకాశం ఇస్తే దోపిడికి ఛాన్స్ ఇచ్చినట్టేనని తెలిపారు.