కరెంట్ లొల్లి : రేవంత్ రెడ్డి కామెంట్స్పై గరం గరం.. ఉద్యోగులా, రౌడీలా అంటూ మరో కోణం ..!
హైదరాబాద్ : ప్రభుత్వంపై, అధికారులపై విపక్ష నేతలు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ వ్యవస్థలోని లొసుగులు ఎత్తి చూపుతూ ప్రజాపక్షంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. అయితే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అటు ప్రభుత్వాన్ని, ఇటు ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రభాకర్ రావు అన్నీ అబద్దాలు చెబుతున్నారని.. గన్ పార్క్ ఎదుట నిలబెట్టి కాల్చినా తప్పులేదని వ్యాఖ్యానించడం చర్చానీయాంశమైంది. ఆ క్రమంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగడం కొత్త చర్చకు దారి తీసింది. విపక్ష నేతపై ఇలా చేయడం తగునా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న విద్యుత్ ఉద్యోగులు
ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరిఎంపీ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యుత్ ఉద్యోగులు భగ్గుమన్నారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రభాకర్ రావుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. హైదరాబాద్లో విద్యుత్ సౌధ నుంచి గన్ పార్క్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభాకర్ రావుకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆయన ప్రెస్ మీట్ తర్వాత కూడా కొందరు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రేవంత్ రెడ్డి అలా మాట్లాడటం సరికాదంటూ ఖండించారు.
360 డిగ్రీల్లో మహా గణపతి.. ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి లైవ్ స్ట్రీమింగ్..!
విద్యుత్ కొనుగోళ్లల్లో అక్రమాలు.. ట్రాన్స్కో సీఎండీని గన్తో కాల్చినా తప్పులేదని...!
తెలంగాణ విద్యుత్ కొనుగోళ్లపై గురువారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫైరయ్యారు. అయితే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అవకతవకలు లేవని టీఆర్ఎస్ బుకాయిస్తోందని మండిపడ్డారు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్ విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయం అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడ చెప్పారని ఆయన గుర్తు చేశారు.
చత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం తెర వెనుక అదానీ, తెర ముందు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. కరెంటును కేసీఆర్ తన ఆర్థిక వనరుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. అయితే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ట్రాన్స్కో ఎండీ ప్రభాకర్ రావు అన్నీ అబద్దాలు చెబుతున్నారని.. గన్ పార్క్ ఎదుట నిలబెట్టి కాల్చినా తప్పులేదని వ్యాఖ్యానించారు.
విపక్ష నేతపై ఉద్యోగుల నిరసన సరికాదంటూ..!
విపక్ష నేతగా ప్రభుత్వంలోని తప్పొప్పులు ఎత్తి చూపుతున్న రేవంత్ రెడ్డిపై విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలపడం సరికాదనే అభిప్రాయం తెరమీదకు వచ్చింది. ఆ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన సర్క్యులేట్ అవుతోంది. మీరు విద్యుత్ ఉద్యోగ సంఘాలా లేక వీధి రౌడీలా అనే రీతిలో హెడ్డింగ్ పెట్టిన ఆ ప్రకటన వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది.
ట్రాన్స్కో సీఎండీ అవినీతితో దివాళా తీస్తున్న విద్యుత్ సంస్థలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి పోరాటానికి సంబరపడాల్సింది పోయి 70వేలమంది తలచుకుంటే ఎక్కడుంటారని ప్రజాగొంతుక రేవంత్ రెడ్డిపై కొన్ని ఉద్యోగ సంఘాలు వీధి రౌడీల్లా బెదిరింపులకు దిగటం సమంజసమేనా ప్రజలారా ఆలోచించండి. విద్యుత్ కొనుగోళ్ళ విషయంలో అబద్దాలాడుతూ అనేక అక్రమాలకు పాల్పడుతున్న ప్రభాకర్రావును పైరవీకారులైన కొన్ని ఉద్యోగా సంఘాల నేతలు వెనకేసుకు రావటం, సీఎండీ భజన పరులుగా మారడంలో ఆంతర్యమేమిటో తెలంగాణ బిడ్డలారా వాస్తవాలు గ్రహించండి అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అమ్మాయిలు అంత ఈజీగా పడిపోతున్నారా.. సైబర్ క్రిమినల్స్ వలకు చేపల్లా చిక్కుతున్నారా?
విపక్ష నేతపై ఇలా రివర్స్ కావడం ఇదే తొలిసారేమో..!
అంతేకాదు.. రేవంత్ రెడ్డి ఒంటరి కాదని రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది కార్యకర్తలున్న కాంగ్రెస్ పార్టీ సైన్యాధ్యక్షుడని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తొత్తులైన ఉద్యోగ సంఘాలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి మరియు సీఎండీ అండ ఉంది కదా అని రేవంత్ రెడ్డి ఇంటికి కరెంటు పీకుతాం అనే ధోరణిలో మాట్లాడితే.. కోటి మంది కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న దందాలు బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలో తింటున్నవి తప్పక కక్కిస్తామన్నారు. ఇక నైనా ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి. లేకుంటే మాట్లాడిన కొందరు నేతలకి తగిన శాస్తి చేస్తాం. రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడిన కొందరు ఉద్యోగ సంఘం నేతలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అదలావుంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక.. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా విపక్ష నేతలపై రివర్స్ అయిన సందర్భాలు లేవని చెప్పొచ్చు. మొత్తానికి ఈ చిచ్చు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.