ఒక్క రూపాయి కోసం రేవంత్ రెడ్డి పోరాటం?.. అరెస్ట్ కేసులో ట్విస్ట్.. ఏమిటా కథ?
Recommended Video
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన అప్పట్లో వివాదస్పదమైంది. ఆ ఘటనలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. స్వయంగా డీజీపీ హాజరుకావాలంటూ ఆదేశించింది. తాజాగా బుధవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా.. రేవంత్ రెడ్డిని అక్రమంగా నిర్భందించలేదని వాదించారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. మరోవైపు రూపాయి అయినా సరే పరిహారం మాత్రం చెల్లించాలంటూ రేవంత్ రెడ్డి లాయర్ కోరారు. దీంతో ప్రభుత్వం ఎంత మేర పరిహారం చెల్లిస్తుందంటూ ఏజీని వివరణ కోరింది ధర్మాసనం.
అరెస్ట్ ఎపిసోడ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం వివాదస్పదమైంది. ఆ క్రమంలో ఆయన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అర్ధరాత్రి రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ మేరకు విచారణ జరిపిన జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఆ కేసుకు సంబంధించి ఎవరెవరో హాజరు కావడం కాదు, స్వయంగా డీజీపీ హాజరుకావాలంటూ ఆదేశించింది.
పిటిషన్ క్లోజ్ చేయండి..! 1/- అయినా పరిహారం ఇవ్వండి
రేవంత్ రెడ్డి అరెస్ట్ పిటిషన్ పై జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రేవంత్ రెడ్డిని పోలీసులు అదేరోజు విడిచిపెట్టారని, ఇక దీనిపై విచారణ అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ పిటిషన్ క్లోజ్ చేయాలని విన్నవించారు. ఆ మేరకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి అభిప్రాయం కోరింది ధర్మాసనం.
ఈ పిటిషన్ క్లోజ్ చేస్తే.. రేవంత్ రెడ్డి విషయంలో జరిగినట్లుగానే ఇతరులతో కూడా పోలీసులు అలానే వ్యవహరిస్తాని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు మోహన్ రెడ్డి. అందుకే రేవంత్ రెడ్డికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలా చేస్తే ప్రభుత్వం తప్పు చేసినట్లు రుజువు అవుతుందని అభిప్రాయపడ్డారు. అది లక్ష రూపాయలు అయినా, ఒక్క రూపాయి అయినా రేవంత్ రెడ్డికి ఓకే అన్నట్లుగా ప్రస్తావించారు. పరిహారం ఎంతైనా సరే ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా గతంలో భీమ్ సింగ్ కేసులో 50 లక్షల రూపాయలను పరిహారం కింద చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందనే విషయం గుర్తుచేశారు.
25కు వాయిదా
పరిహారం విషయంలో రేవంత్ రెడ్డి న్యాయవాది అభిప్రాయం మేరకు ప్రభుత్వం స్పందన ఏందంటూ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను వివరణ కోరింది ధర్మాసనం. రేవంత్ రెడ్డిని అక్రమంగా నిర్భందించలేదని, సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటారనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారని వెల్లడించారు ఏజీ. అరెస్ట్ కు దారితీసిన పరిస్థితులను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం.