కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే సోకుల కోసం సెక్రటేరియట్ కు వందల కోట్లా ? రేవంత్ రెడ్డి సూటిప్రశ్న
టిఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూటి ప్రశ్న వేశారు.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతుంటే,కేసులు విపరీతంగా నమోదు అవుతుంటే..పేదలు కరోనాతో బాధపడుతుంటే వారి కోసం నిధులు ఖర్చు చేయలేదు కానీ సోకుల కోసం సెక్రటేరియట్ కు వందల కోట్లా ? అంటూ ట్విట్టర్ ద్వారా సూటి ప్రశ్న వేశారు రేవంత్ రెడ్డి.
అంతేకాదు సెక్రటేరియట్ నిర్మాణానికి 400 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో మీడియాలో వచ్చిన వార్త క్లిప్పింగ్ కూడా రేవంత్ తన ట్వీట్ లో పోస్ట్ చేశారు.కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం కేసీఆర్ కు చీమకుట్టినట్లు కూడా లేదని, కరోనా సమస్యలు గాలికి వదిలేసి సచివాలయంపై సమీక్షలు చేస్తున్నారని గతంలో విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు కరోనా కథలు.. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే సీఎం కేసీఆర్ సచివాలయంపై దృష్టి పెట్టారని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
మరోపక్క హైకోర్టులో రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ ,విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ లు సచివాలయం కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసర వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరపాలని, పాత సచివాలయ నిర్మాణంలో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోందని కోర్టుకు విన్నవించారు. అయితే ఊహాజనిత అంశాల ఆధారంగా అత్యవసర విచారణ చేపట్టలేమని హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి నిరాకరించింది.