హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు .. మంత్రి పదవి అందుకే రావట్లేదట ?
హైదరాబాద్ : బీజేపీ చీఫ్ అమిత్ షాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఆడియో రికార్డు సీఎం కేసీఆర్ చేరిందని ... దానిని అందజేసిందని స్వయనా హరీశ్ పీఏ అని తెలిపారు. అమిత్ షాతో హరీశ్ మాట్లాడటం వల్లే మంత్రి పదవీ ఇవ్వండ లేదని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యేలకు నగదు పంపిణీ ...
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావు ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చారని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. కేసీఆర్ కు తెలియకుండా 26 మంది టీఆర్ఎస్ అభ్యర్థులకు హరీశ్ డబ్బులు పంచారన్నారు. కొందరు కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించినా .. వారు తీసుకోలేదని స్పష్టంచేశారు. హరీశ్ డబ్బుచ్చిన ఆ ఎమ్మెల్యేల పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో బాగోలేదని .. వారంతా కేసీఆర్ టార్గెట్ లో ఉన్నారని స్పష్టంచేశారు. ఇక హరీశ్ కోటరీకి టీఆర్ఎస్ పార్టీలో గడ్డురోజులు మొదలయ్యాయని తేల్చిచెప్పారు రేవంత్.
అవినీతి కూడా కారణం ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారాయన. తోటపల్లి, గౌరిపల్లి, మిడ్ మానేరు రిజర్వాయర్ పనులను రూ.250 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు పెంచారన్నారు. సీఎం కేసీఆర్ కు తెలియకుండా జరిగిన ఈ వ్యవహారంలో రూ.600 కోట్లను హరీశ్ కాజేశారన్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణలో హరీశ్ పేరు లేకపోవడం ఓ కారణమై ఉంటుందన్నారు.
కడియం సార్ అనడు .. నాయిని నీతిమంతుడు
ఇక మంత్రివర్గ విస్తరణలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి చోటు ఎందుకు దక్కలేదో అనే అంశంపై కొత్త భాష్యమిచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఓ సందర్భంలో కడియం శ్రీహరి సార్ అనలేదట. దీంతో నొచ్చుకున్న యువరాజు లిస్ట్ లో ఆయన పేరు లేకుండా చేశారని చెప్పారు. నాయిని నర్సింహారెడ్డి నీతిమంతుడు .. అవినీతికి తావివ్వడని ఆయనను పక్కనపెట్టారని తెలిపారు.
కిసాన్, జవాన్లంటే లెక్కలేదు ...
సీఎం కేసీఆర్ కు జవాన్లు, రైతులంటే లెక్కేలేదని విమర్శించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి చనిపోతే రెండుసార్లు వెళ్లిన సీఎం .. జవాన్లు చనిపోతే ఎందుకు నివాళి అర్పించలేదని ప్రశ్నించారు. మద్దతు ధర కోసం రైతులు ఆర్మూర్ లో ధర్నా చేస్తుంటే పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఖర్చుచేస్తున్న కేసీఆర్ .. జవాన్లకు 50 కోట్లు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.
కేసీఆర్ ధి ఫ్యుడల్ ధోరణి ..
సీఎం కేసీఆర్ ది ఫ్యుడల్ ధోరణి అని విమర్శించారు. ఆయనకు మహిళల పట్ల చిన్నచూపు ఉందని ఆరోపించారు. భూస్వామి అయిన కేసీఆర్ .. తన వైఖరి మార్చుకోలేదని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు రాష్ట్రాన్ని దోస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ తో యుద్ధం వచ్చే పరిస్థితి ఉందని ... అలా అయితే లోక్ సభ ఎన్నికలు 6 నెలలు వాయిదాపడే అవకాశం ఉందని అంచనా వేశారు.