t pcc chief race:ఏబీవీపీ నుంచి కాంగ్రెస్లో చేరేవరకు: రేవంత్ రెడ్డి అంతరంగం..
కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పోస్ట్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఈ లోపు రకరకాల రూమర్లు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే పీసీసీ రేసులో ముందువరసలో ఉన్న రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి.. కాంగ్రెస్లో చేరేవరకు జరిగిన పరిణామ క్రమాన్ని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో వివరించారు.
Recommended Video
ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేశా..
విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో క్రియాశీలకంగా పని చేశానని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బీజేపీ కంటే ఏబీవీపీ ముందు ఆవిర్భవించిందని తెలిపారు. ఏబీవీపీ 1968లో ఏర్పడితే.. బీజేపీ 1981లో ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చదివేకునే సమయంలో ఆర్ఎస్యూ, పీడీఎస్యూ, ఏబీవీపీ మాత్రమే ఉన్నాయని వివరించారు. ఎవరైనా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో అక్కడున్న పరిస్థితుల ఆధారంగా పార్టీల్లో చేరతారని తెలిపారు. సీఆర్ పార్టీ పెట్టిన తర్వాత.. మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్కు సపోర్ట్ చేయమని కోరితే చేశానని తెలిపారు.
టీఆర్ఎస్కు సపోర్ట్ చేశా..
2001లో మహబూబ్ నగర్లో టీఆర్ఎస్ అడుగుపెట్టడానికి సహకరించానని కూడా చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చానని.. కానీ క్రియాశీలక టీఆర్ఎస్ నాయకుడిని మాత్రం కాదని స్పస్టంచేశారు. జడ్పీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచానని.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత టీడీపీలో చేరానని తెలిపారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ హవా నడుస్తోన్న సమయంలో టీడీపీలో చేరానని పేర్కొన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి రాజశేఖర రెడ్డి హయాంలో అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయన్నారు.
తనకో ప్రత్యేకమైన పేజీ
రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీ ఉండాలని కోరుకునే వాడినని తెలిపారు. రాష్ట్ర స్థాయి నేత కావాలని అనుకునేవాడినని.. తనేనెప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వివరించారు. కార్యాకర్తలను కాపాడుకుంటానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీతో రహస్య ఒప్పందాలేవీ లేవని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని.. వారు పల్లకీ మోస్తేనే నేతలం అయ్యామని తెలిపారు. అందుకోసమే తాను పీసీసీ చీఫ్ కావాలని పార్టీ కేడర్ కోరుకుంటోందని వివరించారు. పీసీసీ చీఫ్ ఎవరు అవుతారనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సిందని తెలిపారు. పార్టీని బలోపేతం చేయడం కోసం తనవంతు శ్రమిస్తానని వివరించారు. తనకు వ్యతిరేకంగా ఒకరో ఇద్దరో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన.. సీనియర్లందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనుకోవద్దని తెలిపారు.
అలా అయితే.. మరీ
రేవంత్కు పీసీసీ చీఫ్ ఇవ్వకపోతే.. బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోందని.. అలా అయితే కాంగ్రెస్లో చేరక ముందే చేరేవాడినని స్పష్టంచేశారు. దుబ్బాకలో ఎలాంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ గెలిచిందో తెలిసిందే అని చెప్పారు. బీజేపీ పేపర్ టైగర్.. ఆ పార్టీ గెలుపు వన్ టైం వండర్గా భావించొచ్చు అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తాను గెలవడానికి టీఆర్ఎస్ వాళ్లు కూడా కృషి చేశారని వివరించారు. కేసీఆర్, నరేంద్ర మోదీ ఇద్దరూ నాణేనికి రెండు వైపులా ఉన్న బొమ్మ, బొరుసు లాంటి వారని.. వారి మధ్య బేధాభిప్రాయాలు లేవన్నారు. ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో అమలు చేయడానికి అనుకూలంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.