ఉత్తమ్పై రేవంత్ ఫైర్: హుజూర్నగర్పై కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
Recommended Video
టీపిసిసి లో అసంతృప్త జ్వాలలు ఎక్కడో ఒక చోట రగులుతూనే ఉంటాయి. పార్టీలో సీనియర్, జూనియర్ నేతలు అనే భేదం లేకుండా కొన్ని సందర్బాల్లో రచ్చ చేసుకుంటూ ఉంటారు. ఆ మధ్య పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు, అంబర్ పేట ఇంచార్జ్ శ్రీకాంత్ గౌడ్తో చెలరేగిన వివాదం పార్టీ నుంచి క్రమశిక్షణా చర్యలు తీసుకునేంత వరకూ వెళ్లింది. ఇందిరా పార్క్ వద్ద మరణించిన ఇంటర్ విద్యార్ధుల తల్లిదండ్రుల సమావేశంలో వేదిక నుంచి వీ. హనుమంతరావును తోసేసిన ఘటనలో శ్రీకాంత్ ను పార్టీ సస్పెండ్ చేసిన సందర్బం కూడా చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఆస్థాయిలో నడుస్తుంటాయి. తాజాగా పీసిసిలో కీలక భూమిక పోషించే రాష్ట్ర స్థాయి నేతల మద్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
టీపిసిసిలో అభిప్రాయ భేదాలు..! నేతల మద్య ముదురుతున్న ఆరోపణలు..!!
నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ ఉపఎన్నిక పట్ల కాంగ్రెస్ లో భిన్నాబిప్రాయాలు చోటుచేసుకున్నాయి. హుజూన్ నగర్ నియోజక వర్గం నుండి గత తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. దీంతో హుజూర్ నగర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా పరిణమించింది. ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్ధిపై కాంగ్రెస్ పార్టీలో మాటల యుద్దం నడుస్తోంది. అభ్యర్థులను ప్రకటించే అధికారం అదిష్టానానికి మాత్రమే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పీసిసి అధ్యక్ష పదవిలో ఉన్న వారికి కూడా అభ్యర్ధిని ప్రకటించే సంస్కృతి లేదనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు మరికొంత మంది నేతలు.
ఉప పోరులో కీలక నేతల భిన్న స్వరాలు..! తొందర పడొద్దంటున్న రేవంత్ రెడ్డి..!!
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధి పేరును పీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం పట్ల నేతలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అదిష్టానం పట్ల ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోక ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్ధిని పేరును ఎలా ప్రకటిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ రామచంద్ర కుంతియా అనుమతి లేకుండా, ఏఐసీసీ నిర్దారణ చేయకుండా ఎలా అభ్యర్థిని ప్రకటిస్తారని పీసిసి మాజీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆశావహులు ఎక్కువగా ఉన్న సందర్బంలో ఆచితూచి అడుగు వేయాల్సిన ఉత్తమ్ లాంటి సీనియర్ నేతలే లీకులకు పాల్పడుతుంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అభ్యర్ధిని ప్రకటించిన ఉత్తమ్..! వ్యతిరేకిస్తున్న మల్కాజిగిరి ఎంపీ..!!
ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరుపున రంగంలోకి దించబోతున్నట్టు ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పద్మావతి పేరును అదిస్టానం ఎంపిక చేయకముందే ఉత్తమ్ కుమార్ ఎలా ప్రకటిస్తారని నిలదీస్తున్నారు. హుజూర్ నగర్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న చామా కిరణ్ రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నాయని, ప్రత్యర్ది ఎవరైనా తన గెలుపు ఖాయమని రేవంత్ రెడ్డి విశ్లేషిస్తున్నారు. చామా కిరణ్ రెడ్డికే తన మద్దత్తు ఉంటుందని చెప్పడంతో పాటు, అదిష్టానం నిర్ధారించిన అభ్యర్ధికే తన మద్దత్తు ఉంటుందని రేవంత్ స్పష్టం చేసారు. మొత్తానికి నోటిపికేషన్ వెలువడక ముందే వేడి రగుల్చుతున్న హుజూర్ నగర్ ఉన ఎన్నిక రానున్న రోజుల్లో మరెంత రంజుగా మారుతుందో చూడాలి.