రేవంత్ రెడ్డి గరం.. గరం..! ఫోన్లు కూడా లిఫ్ట్ చెయ్యరా అంటూ జీహెచ్ఎంసీ అధికారలకు క్లాస్!!
హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంటని ప్రశ్నించారు. అధికారులు కాస్తా ప్రొటోకాల్ పాటించేలా చూడాలని మేయర్ బొంతు రామ్మోహన్కు సూచించారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్సీ నవీన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, డిప్యూటి మేయర్ ఫసియొద్దిన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందుగా దివంగత నేతలు జైపాల్ రెడ్డి, సుష్మా స్వరాజ్, ముఖేష్ గౌడ్తో పాటు ప్రమాదంలో మరణించిన ఇద్దరు బల్దియా ఉద్యోగుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
గచ్చిబౌలిలో ఎమ్మార్ ప్రాపర్టీ అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని కోరారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అసలే వర్షాకాలం, ఆపై ఎక్కడ పడితే అక్కడ గుంతలు.. రాళ్లు రప్పలు తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. డివిజన్ల వారీగా ఇలాంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. చాలామటుకు హైదరాబాద్ లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలు బాగుంటాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ ఏరియాల్లో రోడ్లు చూస్తే అధ్వాన్నంగా తయారయ్యాయని.. వాటిని బాగు చేయించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నగరంలో ముఖేష్ గౌడ్, జైపాల్ రెడ్డి, సుష్మా స్వరాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కొట్లాడితేనే హక్కులు సాధ్యం.. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు, కానీ.. ఈటల ఏమన్నారంటే..!
అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదన్న రేవంత్ రెడ్డి ఆరోపణలపై కమిషనర్ దానకిశోర్ స్పందించారు. పని వత్తిడి వల్ల అలా జరిగి ఉండొచ్చని.. వేరే ఉద్దేశాలు ఏమి ఉండవని చెప్పుకొచ్చారు. అదలావుంటే అధికారులను సరెండర్ చేసే అధికారం సభకు ఉంటుందని.. సభ్యులు ఆ విశిష్ట అధికారాలు ఉపయోగించుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి. పండుగలు వచ్చినప్పుడు హడావిడిగా సమావేశాలు నిర్వహించడం కంటే కాస్తా ముందుగా నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు.