రేవంత్కే పీసీసీ చీఫ్ పదవీ..? అడ్డుకుంటోన్న వ్యతిరేక వర్గం.. కారణం ఇదేనా..?
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవీపై ఉత్కంఠ వీడటం లేదు. ఉత్తమ్ రాజీనామా చేయడంతో కొత్త నేతను ప్రకటించాల్సి ఉంది. పైకి నాలుగు నుంచి ఐదు పేర్లు వినిపిస్తోన్నా.. లాబీయింగ్ మాత్రం జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం ఖాయమని ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఆయన వ్యతిరేక వర్గీయులు జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కొత్త రథసారథి ప్రకటన మరింత ఆలస్యం అవుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ మాంచి ఊపులో ఉంది. పీసీసీ చీఫ్ పదవీని ఒకరికీ ప్రకటిస్తే మరొ వర్గం నుంచి ప్రమాదం ఉంటుంది. అందుకే హై కమాండ్ ఆచి తూచి అడుగులేస్తోంది.
రేవంత్కే పగ్గాలు.. కానీ
టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికే అని స్పష్టత వచ్చింది. కానీ సంప్రదింపులు ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి వ్యతిరేకించే వర్గం ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని తెలిసింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే వార్ వన్ సైడ్ అనే అభిప్రాయం ఉంది. తర్వాత తమ మాట వింటారో లేదోననే ఆందోళన ఉంది. మళ్లీ వైఎస్ మాదిరి పరిస్థితి ఏర్పడుతోందని వారు భావిస్తున్నారు. అందుకే తమ శక్తి మేరకు లాబీయింగ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు.
వైఎస్ మాదిరిగా..
వైఎస్ హయాంలో వార్ వన్ సైడ్ నడిచింది. మిగతా నేతలు మాట్లాడే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే కూడా అలాంటి పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారు. తమ మాట చెల్లకుండా పోతుందని వారు భావిస్తున్నారు. తమ పరపతి కూడా తగ్గిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డిని అడ్డుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుపోలేరేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పాము చావదు.. కర్ర వీరగదు
ఏది ఏమైనా రేవంత్ రెడ్డి తప్పా.. ప్రత్యామ్నాయం అయితే వేరే ఎవరూ లేరనే వాదన వినిపిస్తోంది. దీంతో ఆయనను ప్రకటించాల్సిందేననే డిమాండ్ వస్తోంది. దీనికి తోడు బీజేపీ కూడా మంచి ఊపులో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులకు వలవేస్తోంది. టీపీసీసీ ప్రకటించగా.. అసంతృప్తిగా ఉండేవారు ఇతర పార్టీల వైపు ఉన్నారు. ఇప్పుడు వారికి ఉన్న ప్రత్యామ్నాయం బీజేపీ అనే సంగతి తెలిసిందే. బీజేపీ కూడా అందుకోసం చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరినీ ఒప్పించి పీసీసీ చీఫ్ ప్రకటించే అవకాశం ఉంది.