ఉప్పల్లో విషాదం: విద్యార్థులున్న ఆటోను ఢీకొన్న లారీ..ఇద్దరు చిన్నారులు మృతి
ఈ ఏడాది చివరి రోజు ఇద్దరు విద్యార్థుల జీవితానికే చివరి రోజుగా మారింది. మిత్రులకు హ్యాపీ న్యూఇయర్ చెబుదామని ఎంతో ఆశతో స్కూలుకు బయలుదేరిన విద్యార్థులను లారీ కబళించింది. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను ఇసుక లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎదురుగా జరిగింది.
విద్యార్థులు ధరించిన ఐడీ కార్డుల ఆధారంగా వారు హబ్సిగూడాలోని భాష్యం స్కూలుకు చెందిన విద్యార్థులుగా గుర్తించడం జరిగింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ దూకి పారిపోయాడు. ఇక ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వీరంతా ఉదయాన్నే స్కూలుకు బయలుదేరారు. ఆటో వెళుతుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఆటో బోల్తా కొట్టింది. ఆటోలో నుంచి ఇద్దరు విద్యార్థులు రోడ్డుపైకి పడిపోగా లారీ వారిపైనుంచి దూసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్నారుల శరీరాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇద్దరు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
ఈ ప్రమాదానికి లారీ డ్రైవరే కారణంగా స్థానికులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఈ విషాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరగడంతో ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మృతదేహాలను ట్రాఫిక్ పోలీసులు తరలించారు. గాయపడిన విద్యార్థులను దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరి పిల్లలు మృతి చెందారో తెలియక కంగారు పడ్డారు. తల్లిదండ్రుల రోదనలు పలువురిని కలచివేసింది. ఘటనా స్థలంలో విద్యార్థుల స్కూలు బ్యాగులు, టిఫిన్ బాక్సులు చెల్లచెదురుగా పడిపోయాయి. వీటిని చూసిన పలువురు కంటతడి పెట్టారు.