వనస్థలిపురంలో భారీ చోరీ... రూ.70లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు...
హైదరాబాద్: వనస్థలిపురంలో భారీ చోరీ జరిగింది. నిత్యం రద్దీగా ఉండే పనామా చౌరస్తా వద్ద పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చి రూ. 70 లక్షలు ఎత్తుకుపోయారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్పోర్టులో నోట్ల కట్టలు సీజ్.. మూడేళ్లలో అదే పెద్ద మొత్తం
వ్యాన్ నుంచి డబ్బు చోరీ
పనామా చౌరస్తాలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో పెట్టేందుకు సిబ్బంది వ్యాన్లో డబ్బు తీసుకుని వచ్చారు. పెట్టెల్లో డబ్బును ఏటీఎంలోకి తరలిస్తుండగా.. అదును చూసి దొంగలు తన ప్లాన్ అమలుచేశారు. డబ్బులు కిందపడ్డాయని సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చి రూ.70లక్షలు ఉన్న క్యాష్ బాక్స్ను మాయం చేశారు.
సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
క్యాష్ బాక్స్ మాయమైందన్న విషయం గ్రహించిన బ్యాంకు సిబ్బంది వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.
అంతరాష్ట్ర దొంగల ముఠాగా అనుమానం
రూ.70లక్షలు ఎత్తుకెళ్లిన నిందితుల ఆచూకీ కోసం పోలీసుల రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. అంతరాష్ట్ర దొంగల ముఠా ఈ చోరికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ దొంగతనంలో పాలుపంచుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టంచేశారు.