హైదరాబాద్లో అర్ధరాత్రి రౌడీ షీటర్ దారుణ హత్య...
హైదరాబాద్లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు అన్నాదమ్ములు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్యానంతరం రౌడీ షీటర్ తల్లికి ఫోన్ చేసి చెప్పి మరీ పరారయ్యారు.
వివరాల్లోకి వెళ్తే... గౌలి గౌడ వాసిగా చెబుతున్న వినయ్ అనే వ్యక్తిపై ఛత్రినాక పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. సంతోష్,సందీప్ అనే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు, వినయ్కి ఇటీవల గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ రౌడీ షీటర్లే కావడం గమనార్హం. వీరిపై కూడా రాజమండ్రి,ఛత్రినాక,సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి.
సెల్ఫోన్ గురించి వీరి మధ్య గొడవ చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో బుధవారం(జూన్ 24) అర్ధరాత్రి వినయ్కి ఫోన్ చేసిన సందీప్,సంతోష్.. పీ అండ్ టీ కాలనీకి రావాలని అతనికి చెప్పాడు. వినయ్ అక్కడికి వెళ్లాక సందీప్,సంతోష్ అతనితో గొడవపడ్డారు. ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో సందీప్,సంతోష్ అతని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అతని తల్లికి ఫోన్ చేసి చెప్పి మరీ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.