హైదరాబాద్లో నడిరోడ్డుపై పేలిన రాయల్ ఎన్ఫీల్డ్.. వరుస ఘటనలతో వాహనదారుల్లో భయం (వీడియో)
హైదరాబాద్ : అత్యంత ఖరీదైన బైక్. స్టైలిష్ లుక్. అదంతా ఓకే.. మరి సేఫ్టీ సంగతేంటి. మండుతున్న ఎండలకు పెట్రోల్ ట్యాంకులు పేలుతుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రియులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని లక్డీకాపూల్ లో నడిరోడ్డుపై మంటలు ఎగిసిపడి బ్లో అవుట్ మాదిరిగా పేలింది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. దాంతో ఆ రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు షాక్ తిన్నారు. కొందరైతే భయపడి ఉరుకులు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక మరికొందరు వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకున్నారు. ఆ బైక్ నడుపుతున్న వాహనదారుడికి ప్రమాదమేమీ జరగలేదని సమాచారం. ఆయన అప్రమత్తంగా ఉండటంతో ప్రాణాలు దక్కాయని తెలుస్తోంది.
సెల్ఫీల పిచ్చి.. కేసులు నమోదు.. స్మార్ట్ఫోన్లతో తంటాలు
ఇలా బైకులకు మంటలు అంటుకుని పేలడం ఇదేమీ కొత్త కాదు. గతనెలలో మండుతున్న ఎండలకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పేలిపోయింది. వాహనంతో పాటు దాన్ని నడిపే వ్యక్తి కూడా సజీవ దహనమయ్యారు. అయితే ఎండ వేడితో పెట్రోల్ ట్యాంక్ పేలిపోయినట్లుగా ప్రచారం జరిగింది.
అదలావుంటే సాంకేతిక లోపాలు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ప్రియులను ఇబ్బందులు పెడుతున్నాయనే వాదనలున్నాయి. తాజాగా 7 వేల బుల్లెట్, బుల్లెట్ ఎలక్ట్రా వాహనాలను కంపెనీ వెనక్కి రప్పించడం చర్చానీయాంశమైంది. బ్రేకింగ్ వ్యవస్థలో లోపాలే దానికి కారణంగా తెలుస్తోంది. 2019, మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 తేదీల మధ్య తయారైన వాహనాల్లో బ్రేక్ కాలిపర్ బోల్ట్ సరిగా పనిచేయడం లేదని.. దాంతో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయని గుర్తించి కంపెనీ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్య తలెత్తిన వాహనాలను వెనక్కి తీసుకుని ఫ్రీ గా సర్వీస్ చేసి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.