రూ.50 వేల ఫైన్: గ్రేటర్లో కొత్త పార్కింగ్ పాలసీ, అతిక్రమిస్తే జరిమానా బాదుడే
హైదరాబాద్లో ట్రాఫికే కాదు.. పార్కింగ్ కూడా కష్టమే. సందుల్లో కాదు.. రహదారిపై వాహనం పార్క్ చేయాలంటే అపసోపాలు తప్పవు. ఇందుకోసం గ్రేటర్ పాలకమండలి కొత్త చట్టం తీసుకొచ్చింది. అందుకోసం కఠిన నిబంధనలను కూడా విధిస్తామని స్పష్టంచేశారు. రూల్స్ బ్రేక్ చేశారో ఇక అంతే రూ.50 వేల వరకు ఫైన్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. పదండి.
కొత్త పార్కింగ్ పాలసీ
గ్రేటర్ హైదరాబాద్లో కొత్త పార్కింగ్ పాలసీని అమలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉచిత పార్కింగ్ విధానం అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని మాల్స్, మల్టీప్లెక్స్, వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఉచిత పార్కింగ్ పాలసీ తీసుకొచ్చినా ఇప్పటికీ కొన్ని సంస్థలు అమలు చేయకపోవడంతో బల్దియా అధికారులు దృష్టి సారించారు.
రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్
ఇటీవల పార్కింగ్ దోపిడిపై జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం నిబంధనల ఉల్లంఘనులపై చర్యలకు సిద్ధమైంది. తొలుత మాల్స్, మల్టీప్లెక్స్, వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేస్తోంది. వాణిజ్య సంస్థలు, నిర్ణీత ఫార్మాట్లో టికెట్లను ముద్రించకపోతే, టికెట్లపై పార్కింగ్ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ లేకపోయినా.. చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.
పార్కింగ్ ఇంచార్జీ సంతకం తప్పనిసరి
పార్కింగ్ ఇంఛార్జి సంతకంతో కూడిన పార్కింగ్ టిక్కెట్లను వాహనాలను పార్కింగ్ చేసిన వారికి అందజేయాలి. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘనలను అతిక్రమిస్తే.. ఈవీడీఎం విభాగం నుంచి నోటీసులు అందుతాయి. నోటీసులు అందిన 15 రోజుల్లోగా.. ఈవీడీఎం విభాగం తనిఖీలు చేపడుతుంది. ఉల్లంఘనలు గుర్తిస్తే వారిపై 50 వేల రూపాయల పెనాల్టీ విధిస్తుంది. మాల్స్తోపాటు పలు వాణిజ్య కేంద్రాల్లో మొదటి 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఏ విధమైన బిల్లు లేకుండా పార్కింగ్ చేసిన వారి నుంచి నిర్దేశిత పార్కింగ్ ఛార్జీలను వసూలు చేస్తారు.