ఆర్టీసీ బస్సు బీభత్సం.. బ్రేక్స్ ఫెయిల్.. ఫుల్ కండిషన్.. ఏంటీ ట్విస్ట్?
హైదరాబాద్ : సికింద్రాబాద్ లో శనివారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. అక్కడున్న జనాలకు కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈఘటనలో ఒకరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. అయితే బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు కంట్రోల్ కాలేదంటున్నారు డ్రైవర్. అదేం లేదు.. బస్సు ఫుల్ కండిషన్లో ఉందంటున్నారు ఆర్టీసీ అధికారులు. దీంతో ఎవరి మాట నిజమన్నది తెలియక ట్విస్ట్ గా మారింది.
బస్సు బీభత్సం.. ఢీకొడుతూ ముందుకు..!
పాస్పోర్టు కార్యాలయం సమీపంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు కలకలం రేపింది. అదుపుతప్పి వాహనాలను వరుసగా ఢీకొట్టడం భయాందోళనలు సృష్టించింది. మియాపూర్ -2 డిపోకు (AP 11 Z 6671) చెందిన ఆర్టీసీ బస్సు సాయంత్రం 6 గంటల సమయంలో క్లాక్ టవర్ దగ్గరకు చేరుకోగానే కంట్రోల్ తప్పింది. ఆ రోడ్డులో కాలినడకన వెళుతున్న ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు చనిపోయాడు. డ్రైవర్ అహ్మద్ బ్రేకులు వేసేందుకు ఎంత ప్రయత్నించినా బస్సు ఆగలేదని సమాచారం. అలాగే ముందుకెళ్లి మెట్రో పిల్లర్ల మధ్య ఉన్న డివైడర్ ను తాకి రోడ్డుకు ఆవలివైపుకు చేరింది.
పాదచారిని ఢీకొట్టి అదుపుతప్పడంతో అలాగే ముందుకొచ్చిన బస్సు ఓ కారును తాకింది. అందులో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ కారు వెనకాలే ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టడంతో ఓ ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. అలాగే ఓ ద్విచక్రవాహనదారుడికి తాకడంతో స్వల్పగాయాలయ్యాయి. ఒక మహిళను ఢీకొట్టడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
బ్రేకులు పడలేదా? ఇంకేదైనా కారణమా?
ఈ ఘటనలో బస్సుకు బ్రేకులు పడకపోవడమే ప్రధాన కారణమంటున్నారు డ్రైవర్. క్లాక్ టవర్ దగ్గరకు రాగానే పాదచారి అడ్డువచ్చాడని.. అతడిని తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పిందని చెబుతున్నారు. సీటులోంచి లేచి నిలబడి బ్రేకులను గట్టిగా నొక్కినా.. బస్సు ఆపడానికి వీలుపడలేదన్నారు. ఎదురుగా వస్తున్న రెండు బస్సులతో పాటు మిగతా వాహనాలను తప్పించే క్రమంలో బస్సు అలా ముందుకెళ్లి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టి ఆగిపోయిందంటున్నారు.
కండిషన్, ఫిట్నెస్ ఓకే..! మరి ప్రమాదం ఎలా జరిగింది
బస్సు డ్రైవర్ చెబుతున్నదానికి, ప్రమాదం జరిగినతీరుకు చాలా తేడా కనిపిస్తోంది. బస్సు బయలుదేరిన నుంచి బాగానే పనిచేసిన బ్రేకులు, ప్రమాద సమయానికి ఎందుకు పనిచేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదలావుంటే బస్సు ఫుల్ కండిషన్ లో ఉందని ప్రకటించారు రీజనల్ మేనేజర్ రమాకాంత్. అంతేకాదు ఫిట్నెస్ కూడా బాగానే ఉందని చెప్పారు. బ్రేక్ మీటర్ లో గాలి (air) 6 పాయింట్లు చూపించిందని, దీన్నిబట్టి బ్రేక్ బాగానే పనిచేస్తున్నట్లని తేల్చారు.
ఇటీవలే 15-20 రోజుల కిందటే ఆ బస్సుకు పూర్తిస్థాయి సర్వీసింగ్ చేయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు. అలాగే గాయపడ్డవారికి తగిన సాయం అందేలా చూస్తామన్నారు. మొత్తానికి ఆర్టీసీ అధికారులు బస్సు కండిషన్ పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో అసలేం జరిగిఉండొచ్చనేది ట్విస్ట్ లా మారింది. డిపార్టుమెంట్ విచారణలో అసలు నిజాలు వెలుగుచూసే అవకాశముంది.