ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ వైఫల్యమే, కేసీఆర్పై లక్ష్మణ్ విసుర్లు
సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల గోడు కేసీఆర్కు పట్టదా అని ప్రశ్నించారు. ప్రయాణికులే కాదు కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్.. సమ్మెలో పాల్గొంటే డిస్మిస్..!
హామీ ఏమైంది
అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామని హామీనిచ్చినా కేసీఆర్ ఎందుకు ప్రక్రియ అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్మికుల గొంతు నొక్కడం సబబు కాదన్నారు. ఆర్టీసీ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేదని లక్ష్మణ్ గుర్తుచేశారు. ప్రయాణికులే ప్రగతి రథ చక్రాలు అని స్లోగన్స్ చెప్పే ప్రభుత్వం పండగపూట వారిని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తున్నామని చెప్పినా.. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యమే
ఓ సంస్థ ఉద్యోగులు సమ్మె చేయడం ఆ ప్రభుత్వ వైఫల్యం చెందినట్టేనని లక్ష్మణ్ పేర్కొన్నారు. కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినా కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. కార్మికులతో మొక్కుబడి చర్చలు జరిపారే తప్ప.. పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పండగ పేరు చెప్పి సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని లక్ష్మణ్ అన్నారు.
చర్చలకు సిద్ధమని చెబుతూ
కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం.. చర్చలకు మాత్రం సిద్ధమని చెపుతూ కాలం వెళ్లదీసిందన్నారు. కానీ వారు అడిగిన డిమాండ్లపై మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయిందన్నారు. కేసీఆర్ సర్కార్ కార్మికుల జీవితాలతో ఆటలాడుతుందని విమర్శించారు. ఇది సరికాదని, ప్రభుత్వ చర్యతో కార్మికులు స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.