ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్.. సమ్మెలో పాల్గొంటే డిస్మిస్..!
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయ సమ్మతం కాదన్నారు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ. కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని సూచించారు. విధులకు హాజరు కాని పక్షంలో వేటు తప్పదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సమ్మెలో పాల్గొనే కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. ఆ మేరకు అన్ని డిపోలకు నోటీసులు జారీ చేశారు. కార్మికులు విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుతో అల్టర్నేట్ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు సునీల్ శర్మ. దాదాపు 2 వేలకు పైగా ప్రైవేట్ బస్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా 20 వేల వరకు స్కూల్ బస్సులకు స్పెషల్ పర్మిట్లు ఇచ్చి పోలీస్ బందోబస్తు మధ్య వాటిని ఆయా రూట్లలో నడుపుతామని చెప్పారు. సమ్మె ప్రభావం ఏ మాత్రం కనిపించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటే డిస్మిస్ చేస్తామని.. వారి స్థానంలో కొత్తవాళ్లను నియమిస్తామని స్పష్టం చేశారు.
ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం.. కార్మికులకు అన్యాయం : జీవన్ రెడ్డి
అదలావుంటే సమ్మె వాయిదా వేయాలని ఆయా కార్మిక సంఘాలను కోరినట్లు తెలిపారు త్రిసభ్య కమిటీ సభ్యుడు సోమేశ్ కుమార్. సమ్మెను నివారించడానికి శాఖాపరంగా తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 26 డిమాండ్లపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఆలస్యం తప్పదన్నారు.
త్రిసభ్య కమిటీకి గడువు ఇచ్చి ఆర్టీసీ కార్మికులు డ్యూటీకి రావాలని మరో సభ్యుడు రామకృష్ణారావు కోరారు. ఆర్టీసీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోంటుందని.. అది తెలిసి కూడా ఇలా సమ్మెకు దిగడం భావ్యం కాదన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సమ్మె వాయిదా వేసుకోవాలని కార్మిక సంఘాల నేతలకు సూచించారు. ఈ సమ్మె వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏమీ లేవని.. సంస్థకు మరింత ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు.