టికెట్ టికెట్.. ఆర్టీసీ బస్సుల్లో దోపిడీకి చెక్.. అవి వచ్చేస్తున్నాయట..!
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారుతోంది. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెంపరరీ సిబ్బందితో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమైనా.. తాత్కాలిక సిబ్బంది చేతివాటం ఆ శాఖపై చెరగని ముద్ర వేస్తోంది. అడ్డగోలుగా జనాల నుంచి డబ్బులు పిండుకుంటూ దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు కొకొల్లలు. అందివచ్చిన అవకాశం అనుకుంటున్నారో ఏమో గానీ ప్రయాణీకుల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తున్నారు. ఆ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దాంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఆర్టీసీ సమ్మె కొందరికి కాసుల పంటగా..!
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సమ్మె కాస్తా కొందరికి కాసుల పంటగా మారింది. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుపుతున్న ఆర్టీసీ పెద్దలు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సమ్మె కారణంగా రోజువారీ వేతనాలతో టెంపరరీ డ్యూటీలు చేస్తున్న కండక్టర్లు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టికెట్లు ఇచ్చే యంత్రాలు లేకపోవడంతో ఛార్జీలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. దాంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల గొడవలకు కూడా దారి తీసిన సందర్భాలున్నాయి.
అడ్డగోలు ఛార్జీలు.. ప్రజల నుంచి ఆగ్రహం
ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సుల్లో జరుగుతున్న ఈ అడ్డగోలు దోపిడీతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో ప్రయాణీకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏకంగా రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. దాంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. అదలావుంటే సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతుండటంతో తాత్కాలిక సిబ్బంది విధులను పటిష్టం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్టీసీ విలీనం టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో లేదే : మంత్రి తలసాని
రెండు మూడు రోజుల్లో టిమ్స్.. ఇక ఆ దోపిడీకి చెక్ పెట్టినట్లేనా?
ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పేరిట జరుగుతున్న దోపిడీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందనే వాదనలు లేకపోలేదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే రెండు మూడు రోజుల్లో టికెట్ ఇష్యూయింగ్ మెషీన్స్ (TIM) ను వీలైనంత మేర అందుబాటులోకి తెచ్చేలా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో టికెట్ మెషీన్లను ఎలా వాడాలనే దానిపై తాత్కాలిక సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులర్ సిబ్బంది తరహాలోనే ప్రయాణీకులకు టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు బస్సుల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాల్లో అటు డ్రైవర్లు, ఇటు కండక్టర్లకు తగు శిక్షణ ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారు.
ఛార్టులు ఇచ్చినా నో యూజ్.. ఆగని దోపిడీ
ఆర్టీసీ సమ్మెతో తాత్కాలిక సిబ్బందిని నియమించిన అధికారులు ఆయా రూట్లలో ఎంత మేర ఛార్జీలు తీసుకోవాలనే ఛార్ట్లు (పట్టిక) కండక్టర్లకు ఇచ్చారు. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా ప్రయాణీకుల నుంచి అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు సదరు కండక్టర్లను నిలదీస్తుంటే.. వారి మీదకే గొడవకు దిగుతున్నారు.
ఆర్టీసీ అధికారులకు అప్పజెప్పే లెక్కల్లోనూ చేతివాటం..!
అదలావుంటే ప్రస్తుతం టికెట్లు ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆర్టీసీ అధికారులకు అప్పజెప్పాల్సిన మొత్తంలో కూడా అంతో ఇంతో నొక్కేస్తున్నారు. దీనిపై ఆయా రూట్లలో ఎంత వసూలు అయిందనే విషయంలో అధికారులకు కూడా క్లారిటీ లేకుండా పోతోంది. అందుకే ఇవన్నీ తలనొప్పులకు బదులు టికెట్ ఇష్యూయింగ్ మెషీన్లు అందుబాటులోకి తెస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు రెండు మూడు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.