ఆర్టీసీ సమ్మె ఉధృతం.. 19న తెలంగాణ బంద్.. సక్సెస్ చేయాలంటూ జేఏసీ పిలుపు
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కానుంది. రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నేతలతో మరోసారి భేటీ అయిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఆ క్రమంలో ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి.
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో మరోసారి అఖిల పక్షం సమావేశం నిర్వహించారు జేఏసీ నేతలు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల లీడర్లు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించి ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు జేఏసీ నేతలు.
కేసీఆర్ మరో ఎత్తుగడ.. ఆర్టీసీ సమ్మె విఫలం చేయడానికేనా..! కార్మిక సంఘాల వ్యూహమేంటో?
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం చేస్తున్న సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు అశ్వత్థామ రెడ్డి. ప్రభుత్వం మెట్టు దిగకుండా మొండిగా వ్యవహరిస్తే తాము కూడా ఎంతవరకు వెళ్లేందుకైనా సిద్ధమేనని తెలిపారు. తాము చేస్తున్న ఈ పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. న్యాయ పోరాటం చేసే దిశగా ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు.
గురువారం నాటితో ఆర్టీసీ సమ్మె ఆరో రోజుకి చేరింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బస్సులు నడిపిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం బస్సులు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కొకొల్లలు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కానుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కార్మిక సంఘాల నేతలతో ఇక మాటల్లేవు అనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుండటంపై ఈ సమ్మె ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.