గీత దాటితే వేటే: ఆర్టీసీ జేఏసీకి సర్కార్ అల్టిమేటం, మూడు ప్రత్యామ్నాయాలపై దృష్టి
టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్లపై కార్మిక సంఘాల బెట్టువీడకపోవడం, విధుల్లో చేరకుంటే డిస్మస్ చేస్తామనే ప్రభుత్వం బెదిరించడంతో సమ్మె సైరన్కు రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. తమ కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి ప్రకటించగా. సాయంత్రం 6 గంటల వరకు మంత్రి అజయ్ డెడ్లైన్ విధించడంతో సమ్మె సైరన్ కాకరేపుతోంది.
తెలంగాణాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె .. బస్సులు బంద్ .. డిపోల వద్ద 144 సెక్షన్
దసరా పండుగ సందర్భంగా సమ్మె చేయొద్దని చెప్పినా వినిపించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీపై గుర్రుమీదుంది. సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో చేరాలని మరోసారి మంత్రి అజయ్ హుకుం జారీచేశారు. 6 గంటల్లోపు విధుల్లో చేరకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారిని భవిష్యత్లో ఉద్యోగులుగా గుర్తించబోమని తేల్చిచెప్పారు. విధులకు హాజరుకాని ఉద్యోగులను డిస్మస్ చేస్తామని మరోసారి హెచ్చరించారు.
ఓ వైపు ఆర్టీసీ జేఏసీని హెచ్చరిస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. పండగ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటుంది. దాదాపు 4 వేల ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకోబోతోంది. వీటిలో రోజువారీ డ్రైవర్, కండక్టర్లతో సర్వీసులను నడిపిస్తారు. డ్రైవర్కు రూ.1500, కండక్టర్కు రూ. వెయ్యి చొప్పున అందిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారికి శిక్షణ ఇస్తున్నారు. దీంతోపాటు 7 వేల ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇవాళ 6 వేల బస్సులు నడిచాయని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.