rtc strike: ప్రత్యామ్నాయ మార్గాల్లో యాజమాన్యం.. ప్రైవేట్ బస్సు డ్రైవర్లతో ట్రిప్పులు..?
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె తప్పే పరిస్థితి లేదు. తమ డిమాండ్లపై కార్మిక సంఘాల నాయకులు బెట్టు చేస్తున్నారు. తమకు కాస్త సమయం ఇవ్వాలని కోరినా.. వినిపించుకోవడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టిసారించింది. దసరా పండగ సెలవుల దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోబోతుంది.
పండగ నేపథ్యంలో..
అసలే బతుకమ్మ, దసరా సీజన్, తెలంగాణలో పెద్ద పండుగలు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో ఊరి బాట పట్టారు. ఇప్పటికే చాలామంది తమ సొంతూర్లకు చేరుకున్నారు. కానీ కొందరు విధి నిర్వహణలో ఉన్న వారు, పనుల వాళ్లు ఆగినవారికి రవాణా ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ కార్మికసంఘాలు కూడా సమయం చూసి సమ్మె చేస్తామని అల్టిమేటం జారీచేశాయి.
విలీనమే అజెండా
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ, ఐఆర్ కట్టించాలని కోరుతున్నాయి. దీంతోపాటు 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాయి. వారి డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ పలుమార్లు చర్చలు జరుపుతున్న కొలిక్కి రావడం లేదు. డిమాండ్లపై కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి, ఇతరులు పట్టువీడకపోవడంతో చర్చలు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆర్టీసీ యాజమాన్యం ఫోకస్ చేసింది.
పొమ్మనలేక
ఓ వైపు సమ్మె నోటీసు ఇచ్చి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరితే, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఏంటని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు మండిపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయా మార్గాలపై దృష్టిసారించింది. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడపాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వంతో చర్చించి ఆమోదం తెలిపితే అమలు చేయాలని యోచిస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లకు రోజుకు రూ.1500 చొప్పున ఇస్తారు. అదే కండక్లర్లకు రూ.వెయ్యి వేతనం ఇస్తామని సంకేతాలు ఇచ్చారు.
ఐఆర్, డీఆర్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ఐఆర్, డీఆర్ వెంటనే ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐదేళ్లుగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని గుర్తుచేశారు. రూ.5 వేల కోట్ల పైచిలుకు నష్టాలతో ఉందని తెలిపారు. నష్టాలను వెంటనే పూడ్చాలని కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో 7 వేల మంది కార్మికులు పదవీ విరమణ చేశారని గుర్తుచేశారు. కొత్తగా ఉద్యోగాలను నియమించడం లేదని .. దీంతో ఉన్నవారిపై పనిభారం పడుతుందన్నారు. కానీ కార్మికుల సమస్యలను కార్పొరేషన్ పట్టించుకోవడం లేదన్నారు.