ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు విఫలం, రేపు మరోసారి చర్చలు, ఎస్మా ప్రయోగిస్తామంటోన్న సర్కార్!!
ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మ నేతృత్వంలో చర్చలు జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సహా ప్రధాన డిమాండ్లపై కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి.
సమ్మె అనివార్యం
శనివారం నుంచి సమ్మె చేపడుతామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్లపై చర్చించామని ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలని కోరామని తెలిపారు.
సమయం ఇవ్వండి
తెలంగాణలో దసరా ప్రధాన పండుగ అని సోమేశ్ కుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమ్మె చేయటం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఒకవేళ కార్మికులు సమ్మె చేపడితే ప్రత్యామ్నాయ మార్గాలపై తప్పకుండా ఫోకస్ చేస్తామని తెలిపారు. తమకు వారం రోజుల సమయం ఇస్తే.. కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శుక్రవారం మరోసారి ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమవుతామని తెలిపారు. వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని మరో సభ్యుడు రామకృష్ణారావు తెలిపారు.
ఎస్మా ప్రయోగిస్తాం
ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఐఏఎస్ సునీల్ శర్మ అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వ్యవహరించాలని కోరారు. కాదు కూడదని సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని.. వారికి న్యాయం జరిగేలా నివేదిక ఇస్తామని తేల్చిచెప్పారు.