సత్యవతి రాథోడ్ కు ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ .. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
కార్మికుల సమ్మె 40వ రోజు కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాదు మంత్రులు ఎక్కడ కనపడినా రోడ్లమీదనే ఘెరావ్ చేస్తున్నారు. దీంతో మంత్రులకు రాష్ట్రంలో పర్యటనలు తలనొప్పిగా మారాయి.
రిటైర్డ్ జడ్జీల కమిటీకి నో చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పుపై ఉత్కంఠ
ఆర్టీసీ సమ్మె ఉగ్రరూపం దాలుస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. ఈ క్రమంలో మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా తమ పర్యటనలను కొనసాగించ లేక పోతున్నారు . ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమానికి మంత్రులు వెళ్లినా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ ను ఆర్టీసీ కార్మికులు అడ్డగించారు. దీంతో సత్యవతి రాథోడ్ కు ఆర్టీసీ సమ్మె సెగ తగిలింది.
సత్యవతి రాథోడ్ భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దర్శనానికి వెళుతున్న క్రమంలో విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు భద్రాచలం లోని బ్రిడ్జి సెంటరు వద్ద అడ్డుకున్నారు. శ్రీ సీతారామ చంద్ర స్వామివారి దర్శనంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతున్న ఆమెను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. మంత్రి కారు వెళ్లకుండా అడ్డంగా రోడ్ల మీద పడుకున్నారు.
దీంతోపోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుకు అడ్డంగా పడుకొని మంత్రి కాన్వాయ్ అడ్డుకున్న ఆందోళనకారులు ఎంతకీ రోడ్లపై నుండి లేవకపోవడంతో కార్మికులను పోలీసులు ఈడ్చుకెళ్లారు . దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు మరో మార్గం ద్వారా సత్యవతి రాథోడ్ను అక్కడి నుండి పంపించి వేశారు.