హైకోర్టులో పరిష్కారం కాని ఆర్టీసీ సమ్మె కేసు ... లేబర్ కోర్టులో పరిష్కారం అవుతుందా ?
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కార్మికుల పక్షాన తీర్పు ఇస్తుందని భావించిన కార్మికలోకం హైకోర్టు కార్మికుల సమస్యలు ఎటూ తేల్చక పోవడంతో పరేషాన్ లో పడింది. ఆర్టీసీ సమ్మె పై కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు సమ్మె చట్టబద్ధమా లేదా లేదా అనే అంశాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని తెలిపింది. కేసుకు సంబంధించి బంతిని హై కోర్టు, లేబర్ కోర్టు లోకి నెట్టింది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మికశాఖ కమిషనర్ను ఆదేశించింది.అయితే హైకోర్టులో పరిష్కరించని ఆర్టీసీ కార్మికుల సమస్య లేబర్ కోర్ట్ లో పరిష్కారం అవుతుందా అన్నది ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు ముందున్న టెన్షన్.
ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగారు.. సీఎం కేసీఆర్ కనికరిస్తారా ?
ఆర్టీసీ కార్మిక సమ్మె కేసు ఇప్పుడు లేబర్ కోర్టులో
ఆర్టీసీ సమ్మె జరిగిన నాటి నుండి సమ్మెకు సంబంధించి వివిధ పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కేసు విచారణ సందర్భంగా చివరగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణలో హైకోర్టు ధర్మాసనానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని వెల్లడించింది. ఆ పరిధి దాటి ముందుకు వెళ్లలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మెపై ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. బంతిని లేబర్ కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకుంది.
ప్రభుత్వం చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు
ప్రభుత్వం ఏదైతే హై కోర్టుకు విన్నవించిందో దాని ప్రకారమే హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమస్య లేబర్ కోర్టులో ఉందని, అందువల్ల దీనిపై ముగ్గురు సుప్రీం మాజీ న్యాయమూర్తుల కమిటీ అవసరం లేదని, ఆర్టీసీ కార్మికుల సమ్మె సమస్య లేబర్ కమిషనర్ చూసుకుంటారని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక దాని ప్రకారమే హైకోర్టు సమ్మెపై కేసును లేబర్ కోర్టు బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
కార్మిక పక్షాన హైకోర్టు ధర్మాసనం నిలుస్తుందని భావించిన కార్మికులకు షాక్
నిన్న మొన్నటి దాకా హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారమవుతుందని, కోర్టు చొరవ చూపుతుందని, కార్మికుల పక్షాన నిలబడుతుందని కార్మికలోకం భావించింది. కానీ కార్మికులకు షాక్ ఇస్తూ హై కోర్ట్, లేబర్ కోర్టు ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తుందని చెప్పడం కార్మికలోకం జీర్ణించుకోలేకపోతోంది. తమ సమస్య పై హైకోర్టు కూడా చేతులెత్తేసినట్లే అని కార్మికలోకం భావిస్తుంది. కార్మికులపై సానుభూతి ఉన్నట్లుగా ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేస్తూనే, ప్రభుత్వాన్ని ఆదేశించలేమని చెప్పడం కార్మికులకు ఏమాత్రం రుచించడం లేదు.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు నిర్ణయంతో కేసీఆర్ దే పై చెయ్యి
ఈ నిర్ణయంతో ఆర్టీసీ సమ్మె పై కెసిఆర్ దే పై చేయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజుల తరబడి విచారణ చేసి, సమ్మె పరిష్కరిస్తుంది అనుకున్న హైకోర్టు పరిష్కారం చూపే పని లేబర్ కోర్టు చూసుకుంటుందని చెప్పడంతో హైకోర్టులోనే పరిష్కారం కాని ఆర్టీసీ కార్మికుల సమస్యలు, లేబర్ కోర్ట్ లో పరిష్కారం అవుతుందా అన్న సందిగ్ధం నెలకొంది. ఇక రెండు వారాల్లో ఆర్టీసీ సమ్మె పరిష్కారం చేయాలని లేబర్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కానీ లేబర్ కోర్టు కార్మికులకు అనుకూలంగా సమస్యను పరిష్కరిస్తుందా అనేది ఒకింత ప్రశ్నార్థకమే.
హైకోర్టులో పరిష్కారం కాని సమస్య లేబర్ కోర్టులో పరిష్కారం అవుతుందా ?
హైకోర్టు ప్రభుత్వానికి పలుమార్లు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూచించినప్పటికీ ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదు. ఇక లేబర్ కోర్టులోనూ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వైపు నుంచి వైఖరి మాత్రం అదే విధంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో కార్మికుల తమకు అనుకూలంగా లేబర్ కోర్టు తీర్పు ఇస్తుంది అన్న భావనలో లేరు.
సమ్మె విరమించే యోచన .. సందిగ్ధంలో కార్మిక లోకం
దీంతో కార్మిక పోరాట ఫలితం కార్మికులకు అనుకూలంగా రాదేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదేమైనా నేడు సడక్ బంద్ ను నిర్వహించి తమ ఆందోళన ఉధృతం చేయాలని భావించిన ఆర్టీసీ కార్మికులు హైకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించడంతో నేటి సడక్ బంద్ ను వాయిదా వేశారు. నేడు సమ్మెను విరమించే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సమ్మె విరమించి కాంప్రమైజ్ అయినా సీఎం కేసీఆర్ కార్మిక లోకాన్ని కనికరిస్తారా అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య .