ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగారు.. సీఎం కేసీఆర్ కనికరిస్తారా ?
41 రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలలో కన్నీటిని మిగిల్చింది. ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయింది. దీంతో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఒక మెట్టు దిగాలని భావించింది. అందుకే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో కీలకమైన విలీన డిమాండ్ ను పక్కన పెట్టింది. ఇన్నాళ్లు పోరాడిన ఆర్టీసీ జేఏసీ తాజాగా తమ ప్రధాన డిమాండ్ ను పక్కన పెట్టేసి మిగిలిన డిమాండ్ల ను పరిష్కరించాలంటూ మెట్టు దిగి చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. కానీ సీఎం కేసీఆర్ మెట్టు దిగిన ఆర్టీసీ కార్మికులను కనికరిస్తారా ? చర్చలు జరిపి మిగతా సమస్యలు పరిష్కరిస్తారా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కార్మిక కుటుంబాల క్షేమం కోసమే మెట్టు దిగిన ఆర్టీసీ కార్మిక జేఏసీ
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన ఇప్పటివరకు రాలేదు. సెప్టెంబర్ నెల నుండి జీతాలు లేకపోవడం, ఇప్పటికే ఆర్టీసీ కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవటం, ఆర్టీసీ సమ్మె పరిష్కారం కావడం లేదని చాలా మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం, మనస్తాపంతో అనారోగ్యానికి గురికావడం వంటి అనేక కారణాలు మరికొన్ని రోజులు సమ్మె ఇలాగే కొనసాగితే చాలా ఆర్టీసీ కార్మిక కుటుంబాల పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉందని భావించి ఆర్టీసీ కార్మిక జెఎసి విలీన డిమాండ్ ను పక్కన పెడుతున్నట్లుగా పేర్కొని ఒక మెట్టు దిగింది.
విలీన డిమాండ్ పక్కన పెట్టినా చర్చలకు ఓకే అంటారా ?
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్ సాధ్యం కాదని మొదటి నుంచి చెపుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కార్మికులు ఒక అడుగు వెనకడుగు వేయటంతో అయినా స్పందిస్తారా? కార్మిక జేఏసీ నాయకులతో మిగతా డిమాండ్ల మీద చర్చకు ఆహ్వానిస్తారా ? సానుకూలంగా సమస్యను పరిష్కరించి ఆర్టీసీ కార్మికులు అందరిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ప్రధానంగా ఆర్టీసీ కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో ఇప్పటివరకు సానుకూలంగా స్పందించని కేసీఆర్
తాము ఒక అడుగు వెనక్కి వేసినప్పటికీ విలీన ప్రస్తావన లేకుండా ప్రభుత్వం చర్చలు చేస్తుంది అన్న విశ్వాసం ఆర్టీసీ కార్మికుల లో ఏమాత్రం కనిపించలేదు. నిన్నటి వరకు హైకోర్టు తమ సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తే హైకోర్టు తన చేతిలో ఏమీ లేదని చట్టపరంగా చెయ్యాల్సింది మాత్రమే తాము చేస్తామని తేల్చి చెప్పింది. ఇప్పటి కేరెండుసార్లు సమ్మెను భేషరుతుగా వదులుకొని ఉద్యోగాల్లో చేరాలని చెప్పిన కేసీఆర్.. అంతకు మించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయం లో సానుకూలంగా స్పందించింది లేదు. మరో వైపు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు.
చర్చలు జరపాలనే మెట్టు దిగిన కార్మికులు
తాజాగా ఆర్టీసీ జేఏసీ నేతలు ఒక అడుగు వెనక్కి వేయటం ద్వారా తాము ప్రభుత్వంతో చర్చలు కోరుకుంటున్నామని కార్మికులు తేల్చి చెప్పేశారు. సహజంగా ఇన్ని రోజులు ఆందోళనలు చేస్తే ప్రభుత్వ ఇబ్బంది పడాలి కానీ, ఇక్కడ రివర్స్ లో ఆర్టీసీ కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కార్మికులు ఒక అడుగు వెనక్కు వేస్తూ తీసుకున్న నిర్ణయం తప్పా ఒప్పా అన్నది పక్కన పెట్టి, అసలు చర్చలు జరుగుతాయా అన్నది ప్రశ్న .
మిగతా డిమాండ్స్ పరిష్కరిస్తారా ? అలాగే మొండిగా ప్రవర్తిస్తారా
అసలు విలీనం అంశాన్ని పక్కన పెట్టి మిగతా డిమాండ్లపై న అయినా కార్మికులకు న్యాయం చేకూరేలా చర్చలు చేస్తారా? లేదా కార్మిక కుటుంబాలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంత మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న, అనారోగ్యంతో చనిపోతున్నా అయ్యో పాపం అనని సీఎం కేసీఆర్ ఇప్పుడు కార్మికులు ఒక మెట్టు కిందికి దిగిన అంతమాత్రాన పాజిటివ్ గా మారతారా అంటే కష్టమే అనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక కార్మికుల తాజా నిర్ణయంతో ఆయన మరింత అగ్రెసివ్ గా మారతారా అన్నది తెలియాల్సి ఉంది.