విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా భేటీ.. మార్గదర్శకాలు సిద్దం చేయాలని ఆదేశం
తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్పై ప్రభుత్వం స్పస్టత ఇచ్చింది. నిన్న ఉన్నతాధికారులతో సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించి కార్యాచరణ మొదలయ్యింది. ఇవాళ (మంగళవారం) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. విద్యాసంస్థలను ప్రారంభించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
డెడ్ లైన్ 25వ తేదీ..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రెడీ చేయాలని విద్యాశాఖ అధికారులకు స్పష్టంచేశారు. అధికారులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ఈ నెల 25 నాటికి సిద్ధం కావాలని సూచించారు. తొమ్మిది, పది తరగతులు, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఈ నెల 20లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు.
భోజన సదుపాయం..
విద్యా సంస్థలు, సంక్షేమ హాస్టళ్లు.. గురుకుల పాఠశాలల్లోని పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యా సంస్థల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు బియ్యం, పప్పు ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు పంపిస్తారని తెలిపారు. అన్ని పాఠశాలలను విద్యాశాఖ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ నెల 19న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల యాజమాన్య కమిటీలతో సమావేశమవుతామని తెలిపారు. 9,10, ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం క్యాలెండర్ ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
తల్లిదండ్రులు మాత్రం నో..
పేరంట్స్ మాత్రం పిల్లలను స్కూల్/ కాలేజీలకు విద్యార్థులను పంపించడంపై నో అంటున్నారు. చదువు కన్నా ప్రాణం ముఖ్యం అని చెబుతున్నారు. ఇప్పటివరకు లాగానే ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని కోరుతున్నారు. మార్చి నుంచి లాక్ డౌన్ అమలు చేశారని.. మరో రెండు నెలలు గడిస్తే అకడమిక్ ఇయర్ అయిపోతుందని చెబుతున్నారు. ఇప్పటికే 70 శాతం వరకు పోర్షన్ అయపోయిందని చెప్పారు. మరో 30 శాతం పోర్షన్ కోసం స్కూల్ తెరవడం సరికాదు అని అభిప్రాయపడుతున్నారు.