వృషభోత్సవం.. హైదరాబాద్లో ఘనంగా సదర్ వేడుకలు
హైదరాబాద్ : దీపావళి అంటే హైదరాబాద్ వాసులకు మరో వేడుక ఠపీమని గుర్తొస్తుంది. అదే సదర్ ఉత్సవం. దేశంలో ఎక్కడా జరగని విధంగా కేవలం భాగ్యనగరానికే పరిమితమైన సదర్ ఉత్సవం చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. హైదరాబాద్ మహా నగరంలో జరిగే ఎన్నో పండుగల మాదిరిగా సదర్కు కూడా చాలా ప్రత్యేకత ఉంది. దీపావళి పండుగ మరునాడు యాదవ సోదరులు జరుపుకునే సదర్ ఉత్సవం కనుల పండువగా జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఈసారి కూడా నగరంలో పలుచోట్ల జరిగిన సదర్ వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సదర్ ఉత్సవం.. వృషభ రాజుల పండుగ
హైదరాబాద్లో సదర్ ఉత్సవం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దీపావళి పండుగ మరునాడు యాదవ సోదరుల ఆధ్వర్యంలో జరిగే సదర్ ఉత్సవం ఎంతగానో ఆకట్టుకుంటుంది. సదర్ అంటే హైదరాబాద్ ప్రజల వ్యవహారిక భాషలో ప్రధానమైంది అనే అర్థం గోచరిస్తుంది. హైదరాబాద్లో తప్ప మరెక్కడా కనిపించని సదర్ ఉత్సవం యాదవ సోదరులకు ప్రీతి పాత్రమైన పండుగగా చెప్పొచ్చు. వృషభ రాజులను అందంగా అలంకరించి వాటితో యాదవ సోదరులు కుస్తీ పట్టే తీరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఆర్టీసీ సమ్మె చరిత్రాత్మకం.. 25 రోజులుగా ఆందోళన పర్వం.. సకల జనభేరికి సన్నద్ధం
సదర్ ఉత్సవాలకు మరింత కళ
ఇదివరకు సదర్ ఉత్సవం అంటే నారాయణ గూడ ప్రాంతం ఒక్కటే గుర్తుకొచ్చేది. అంత బాగా సదర్ ఉత్సవాలు ఈ ఏరియాలో జరుగుతాయి. ఇప్పటికీ కూడా నగరంలోని పలుచోట్ల సదర్ వేడుకలు నిర్వహించినప్పటికీ.. నారాయణ గూడలో జరిగే సదర్ ఉత్సవాలకే అధిక ప్రాధాన్యత దక్కుతోంది. యాదవ సోదరులు ఎక్కువగా నివసించే పలు ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
కాచిగూడ, చప్పల్ బజార్, ఖైరతాబాద్, కార్వాన్, బోయిన్ పల్లి తదితర ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి పోటీ పడుతుంటారు. అయితే రియల్ ఎస్టేట్ భూం కారణంగా 2009 తర్వాత సదర్ ఉత్సవాలకు మరింత క్రేజ్ వచ్చినట్లైంది. ఆ క్రమంలో పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల నుంచి భారీ శరీరం కలిగిన వృషభరాజా లను తీసుకొచ్చి సదర్ ఉత్సవాలకు మరింత వన్నెలద్దుతున్నారు.
వృషభ రాజులకు స్పెషల్ దాణా.. వారం ముందుగా అలంకరణ
సదర్ ఉత్సవం సందర్భంగా వృషభ రాజులను అందంగా అలంకరిస్తారు. అయితే సదర్ వేడుకలకు ముందే కొన్ని నెలలుగా వాటికి పోషక విలువలు కలిగిన దాణా పెడుతుంటారు. ఇక దీపావళి సందర్భంగా పండుగకు వారం రోజుల ముందు నుంచే వాటిని అందంగా తీర్చిదిద్దేలా శ్రమిస్తారు యాదవ సోదరులు. వృషభ రాజులపై ఉన్న వెంట్రుకలు తొలగించి నల్లగా నిగనిగలాడేలా వెన్న లేదా పెరుగు ఉపయోగించి అందంగా తీర్చిదిద్దుతారు. ఇక సదర్ ఉత్సవం నాడు వాటిని మరింత అందంగా అలంకరించే క్రమంలో కొమ్ములకు రంగురంగుల రిబ్బన్లు కట్టడం, నెమలి ఈకలు అమర్చడం చేస్తుంటారు. అంతేకాదు సుగంధ ద్రవ్యాలు కూడా చల్లడం విశేషం.
వృషభ రాజులతో యువకుల కుస్తీ
అదలావుంటే సదర్ వేడుకల సందర్భంగా అందంగా అలంకరించిన వృషభ రాజులతో యువకులు కుస్తీ పడుతుంటారు. వాటికి కట్టిన ముక్కుతాడును చేతబట్టి అదుపు చేస్తుంటారు. ఆ క్రమంలో అవి ముందరి కాళ్లు పైకి లేపి యువకుల పైకి వస్తుంటాయి. అయితే భారీ శరీరం కారణంగా వాటిని నియంత్రించగలుగుతారు. ఇక కొన్ని చోట్ల వాటిని సుతారంగా గంగిరెద్దుల్లాగా ఆడిస్తుంటారు. సదర్ ఉత్సవం అంటే యాదవ సోదరులకు పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అందుకే కుటుంబ సభ్యులంతా కూడా ఈ వేడుకల్లో పాల్గొని ఆనందిస్తుంటారు. ఇక చిన్నా, పెద్దా తేడా లేకుండా వేసే తీన్మార్ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటాయి.
ఇద్దరితో ప్రేమాయణం, రాసలీలలు.. తల్లి హత్య కేసులో ట్విస్టులెన్నో..!
పలుచోట్ల సదర్ ఉత్సవాలు ఘనంగా.. చప్పల్ బజార్లో కిషన్ రెడ్డి సందడి
ఎప్పటిలాగే ఈసారి కూడా హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాచిగూడ చప్పల్ బజార్లో సందీప్ యాదవ్ అనే యువకుడి నేతృత్వంలో జరిగిన సదర్ వేడుకలు ఆకట్టుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వృషభాలను అందంగా అలంకరించిన పలువురు యాదవ సోదరులకు బహుమతులను అందించారు.
మరోవైపు లడ్డు యాదవ్ అనే మరో యువకుడు నిర్వహించిన సదర్ వేడుకలు సైతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందంగా అలంకరించిన వృషభ రాజులతో పాటు యువకుల ఆటపాటలతో సదర్ ఉత్సవం సందడిగా సాగింది. అటు నార్సింగి మాజీ సర్పంచ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ వేడుకల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు. ఇక్కడ పంజాబ్ నుంచి తెప్పించిన స్పెషల్ వృషభ రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.