t pcc race:ఇప్పుడే వద్దు, సాగర్ బై పోల్ తర్వాత.. జానారెడ్డి వినతి..మరీ హై కమాండ్..?
టీ పీసీసీ చీఫ్ ఎంపిక ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొనగా.. మూడో కృష్ణుడు జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీనిని ఆయన ఖండించారు. ఇలా ఉండగా సీన్లోకి మాజీమంత్రి జానారెడ్డి వచ్చారు. ఇప్పుడే పీసీసీ చీఫ్ను నియమించొద్దు అని కోరుతున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే ప్రకటించాలని ఆయన హై కమాండ్ను కోరారు. టీ పీసీసీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ నెలకొనగా.. జానారెడ్డి ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో హై కమాండ్ ఏం చేస్తుందనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.
తెరపైకి మరో ట్విస్ట్
టీ పీసీసీ చీఫ్ ఎంపికపై మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని హై కమాండ్కు జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్ రాజుకు, హై కమాండ్ పెద్దలకు జానారెడ్డి ఫోన్ చేసి తెలిపారు. పీసీసీ ఇష్యూ ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడుతుందని వారికి జానారెడ్డి తేల్చిచెప్పారు. ఉప ఎన్నికకు ముందు ప్రకటనతో నేతల్లో ఐక్యత లోపిస్తుందని తెలిపారు.
హై కమాండ్ తర్జన భర్జన
జానారెడ్డి విజ్ఞప్తితో పీసీసీ ఎంపిక విషయంలో ఏఐసీసీ తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే జిల్లా నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ టీపీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందన్న అంశంపై అభిప్రాయాలు సేకరించారు. ఎంపీ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని హస్తినకు పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాజాగా జానారెడ్డి సూచనతో పీసీసీ చీఫ్ ఎంపికపై ప్రతిపాదన మరింత ఉత్కంఠను రేపుతోంది.
అనూహ్యంగా జీవన్ రెడ్డి పేరు
టీపీసీసీ రేసులో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఎంపీ రేవంత్రెడ్డే కాబోయే చీఫ్ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. రేవంత్ను ప్రచార కమిటీ చైర్మన్గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్రెడ్డిని పీసీసీ చీఫ్గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు రేవంత్కే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్రెడ్డిని పీసీసీ చీఫ్గా, రేవంత్ను ప్రచార కమిటీ చైర్మన్గా నియమించే యోచనలో హైకమాండ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో జానారెడ్డి ప్రతిపాదన చేశారు. ఆయన చేసిన వినతి కూడా పార్టీకి మేలు చేసేదే. దీంతో అధిష్టానం బంతిలో టీ పీసీసీ చీఫ్ ఎంపిక బాధ్యత ఉంది.