t pcc race:జానా విజ్ఞప్తికి హై కమాండ్ ఓకే.. సారథి ఎంపిక వాయిదా..? కారణమిదే..?
టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఒకడుగు ముందుకు పడితే.. రెండడుగులు వెనక్కి పడుతోంది. చీఫ్, ప్రచార కమిటీ చైర్మన్ పదవులకు నేతల ఎంపిక పూర్తయిందని ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఇంతలోనే మరోసారి బ్రేక్ పడింది. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత ప్రకటించాలనే ప్రతిపాదన వచ్చింది. చివరి క్షణంలో సీనియర్ నేత జానారెడ్డి చక్రం తిప్పారని.. ఇబ్బందులను రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలుస్తోంది. దీంతో టీ పీసీసీ చీఫ్ ఎంపిక ఆగిపోయిందని విశ్వసనీయంగా తెలుస్తోంది.
వాయిదాల పర్వం..
టీ పీసీసీ సారథికి సంబంధించి రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయిందని ఇదివరకు వార్తలు వచ్చాయి. సీనియర్ల అసంతృప్తితో హైకమాండ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.ఆ తర్వాత జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ప్రకటనే మిగిలిందన్న వార్తలు గాంధీ భవన్ చుట్టు చక్కర్లు కొట్టాయి. అంతలోనే మళ్లీ చీఫ్ ఎంపిక వాయిదా పడింది. త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉండడంతో పీసీసీ ఎంపిక వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
Recommended Video
బై పోల్పై ప్రభావం..
కొత్త సారథిగా ఎవరు వచ్చిన ఆ ఎఫెక్ట్ సాగర్ ఉప ఎన్నికల్లో పడుతుందని అందుకోసం మరికొంత కాలం వాయిదా వేయాలని జానారెడ్డి హైకమాండ్కి ఫోన్ చేసినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారని హైకమాండ్కి చెప్పినట్టు తెలుస్తోంది. టీపీసీసీ ఎంపిక విషయంలో ఏఐసీసీ తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం పీసీసీ ఎంపిక పంచాయితీ సోనియా గాంధీ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది.
జానా ఫోన్తో వెనక్కి..?
టీపీసీసీ రేసులో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఎంపీ రేవంత్రెడ్డే కాబోయే చీఫ్ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. రేవంత్ను ప్రచార కమిటీ చైర్మన్గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్రెడ్డిని పీసీసీ చీఫ్గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు రేవంత్కే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్రెడ్డిని పీసీసీ చీఫ్గా, రేవంత్ను ప్రచార కమిటీ చైర్మన్గా నియమించే యోచనలో హైకమాండ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జానారెడ్డి ప్రతిపాదన చేశారు. ఆయన చేసిన వినతి కూడా పార్టీకి మేలు చేసేది కాగా.. హై కమాండ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.