కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మరోసారి..! 21 నుంచి సహస్ర చండీ యాగం
హైదరాబాద్ : మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈమేరకు సిద్ధిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయం క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు యాగం నిర్వహించేలా ప్లాన్ చేశారు. విశాఖ పర్యటనలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచనలు తీసుకున్న కేసీఆర్.. ఈ మహాక్రతువు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పంచాయతీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ యాగం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సహస్ర చండీ యాగంలో రెండు వందల మంది రుత్వికులు పాల్గొంటారని సమాచారం. ఈ కార్యక్రమం వీక్షించేందుకు సందర్శకులను అనుమతిస్తారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. 2015 సంవత్సరంలో ఆయుత (10వేలు) చండీ యాగం చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు కేసీఆర్.