శబరిమల ఘటనపై నిరసన.. అయ్యప్ప భక్తుల కాలినడక..!
హైదరాబాద్ : శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ఎంట్రీ వివాదస్పదంగా మారింది. తెల్లవారుజామున 40 ఏళ్ల లోపు వయసుగల కనకదుర్గ, బిందు అనే మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై భక్తులు మండిపడుతున్నారు. తొలిసారిగా ఈ ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధికి చేరుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలకు దిగుతున్నారు.
బుధవారం తెల్లవారుజామున శబరిమలలో జరిగిన ఘటనను.. హైదరాబాద్ లోని సైదాబాద్ కు చెందిన అయ్యప్ప స్వామి దీక్షాపరులు తీవ్రంగా ఖండించారు. ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలు.. అయ్యప్ప సన్నిధికి చేరుకోవడం సరికాదని తప్పుబడుతున్నారు. ఈమేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. సైదాబాద్ నుంచి వందలాది సంఖ్యలో అయ్యప్ప దీక్షాపరులు కాలినడకన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం.. శబరిమలను కాపాడుకుందాం అనే నినాదంతో ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.