మైనర్ బాలికపై రేప్: దోషికి జీవితఖైదు విధిస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంగారెడ్డి ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దోషికి జీవితకాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధించింది.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని గాజులపాడ్ గ్రామంలో 2015, జనవరి 6న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. బాధితురాలు తన ఇంట్లోనే పడుకుని ఉండగా.. బైదొడ్డి నాగయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కంగ్టి పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై నారాయణఖేడ్ సీఐ విచారణ చేపట్టి నేరస్తునికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జీ పాపయ్య నిందితుడు నాగయ్యను దోషిగా తేల్చి జీవితఖైదు విధించారు.
కాగా, కోర్టులో బాధితురాలి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి బలమైన వాదనలు వినిపించి నేరస్తునికి శిక్షపడేలా చేశారు. హైదరాబాద్లో దిశ ఘటనపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డి కోర్టు తీర్పు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దిశపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితులను కూడా వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.