కేసీఆర్ సర్కార్కు షాక్: సుప్రీంకోర్టు నుంచి నోటీసులు: మొన్నే ఆ కేంద్ర పథకంపై కామెంట్స్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం షాక్ ఇచ్చింది. నోటీసులను జారీ చేసింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం పట్ల ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే విషయంలో మరో మూడు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ సహా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు నోటీసులను అందుకున్నాయి. రెండురోజుల కిందటే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అదే పథకాన్ని ఉద్దేశించి నిండుసభలో కామెంట్స్ చేశారు.
Recommended Video
మరోసారి వైఎస్సార్ను స్మరించిన కేసీఆర్: నిండుసభలో: ఆరోగ్యశ్రీ ముందు ఆయుష్మాన్ దండగ
ఆ పథకం దండగమారి అని, పనికిరానిదంటూ నిండు సభలో వ్యాఖ్యానించారు. ఆ పథకమే- ఆయుష్మాన్ భారత్ యోజన. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. తక్కువ ప్రీమియం చెల్లింపుతో అందరికీ వైద్య సదుపాయాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఈ పథకం కొన్ని రాష్ట్రాల్లో అమలు కావట్లేదు. ఈ పథకాన్ని అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందనే కారణంతో ఆ పథకాన్ని అమలు చేయట్లేదని అంటున్నారు.
దీనిపై సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు కావట్లేదని పిటీషన్దారు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల కలిగే లబ్దిని కోల్పోతున్నారని పిటీషన్లో పొందుపరిచారు. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. శుక్రవారం ఈ పిటీషన్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా పిటీషన్దారుడి తరఫు న్యాయవాది పలు కీలకాంశాలను ప్రస్తావించారు.
దేశం మొత్తం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు ఉద్దేశపూరకంగానే ఈ పథకాన్ని అమలు చేయట్లేదని అన్నారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు నోటీసులను జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా- ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని కేసీఆర్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందటే ఆయన నిండుసభలో ఈ పథకాన్ని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో పోల్చుకుంటే.. ఆయుష్మాన్ భారత్ ఎందుకూ పనికిరాదని అన్నారు.