జూన్ నెల వచ్చింది.. తల్లిదండ్రులకు టెన్షన్ తెచ్చింది..! స్కూళ్లలో దోపిడీ ప్రారంభమైంది..!
హైదరాబాద్ : జూన్ మాసం వచ్చేసింది. వస్తూ వస్తూ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఫీవర్ తెచ్చింది. అది మామూలు జ్వరం కాదు. చేతిలో డబ్బులు లేకుంటే గుండె ఝల్లుమనేలాంటి బుఖార్ (హిందీలో జ్వరం). ఎండాకాలం సెలవులు వచ్చాయి.. హమ్మయ్య ఖర్చులు తగ్గాయి అనుకునేంతలోపే జూన్ నెల మళ్లీ వచ్చింది. దాంతో తల్లిదండ్రుల్లో ఎప్పటిలాగే ఆందోళన నెలకొంది.
మారుతున్న కాలంలో ఎడ్యుకేషన్ కాస్ట్లీగా మారింది. పాఠశాల విద్య వ్యాపారంగా మారింది. నర్సరీ మొదలు పదో తరగతి దాకా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. విద్యా హక్కు చట్టమున్నా అది పేరుకు మాత్రమే.
జూన్ నెల.. తల్లిదండ్రుల జేబులకు వల
జూన్ నెల వచ్చిందంటే స్కూలింగ్ పిల్లలున్న తల్లిదండ్రులకు గుండె గుభేల్మంటుంది. పిల్లల చదువుల కోసం తాపత్రాయపడుతూ ఎడ్యుకేషన్ విషయంలో రాజీ పడట్లేదు. ఇదే ఆసరాగా ప్రైవేట్ స్కూళ్ళు కాసుల పంటగా మార్చుకుంటున్నాయి. ఫీజుల పేరిట వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఎక్కడైనా చదువొక్కటే.. కానీ, కొన్ని స్కూళ్లు స్పెషల్ తోకలు తగిలిస్తూ టెక్నో, డీజీ అంటూ తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
ఈ నెల 12 నుంచి స్కూళ్లు రీఓపెన్ కానుండటంతో తల్లిదండ్రులు జేబులోని డబ్బులపై లెక్కలు వేసుకుంటున్నారు. పిల్లల స్కూళ్లకు సరిపోతాయా, లేదంటే అప్పు చేయాల్సిఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ప్రతి ఏడాది సంపాదనలో పెరుగుదల లేకున్నా.. స్కూల్ ఫీజులు మాత్రం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉండటం పేరెంట్స్ను కలవరపెడుతోంది.
కిషన్ రెడ్డి లక్ : హెంగార్డుల కోసం పోరాడారు.. హోం మంత్రి అయ్యారు
జీవో నెం.1 ఏమైంది.. ఎక్కడైనా అమలవుతోందా?
ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఫీజుల నియంత్రణ కోసం 15 ఏళ్ల కిందట జారీ చేసిన జీవో నెం.1 చెత్తబుట్ట దాఖలుగా తయారైంది పరిస్థితి. దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఇటు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు గానీ, అటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు గానీ జీవో నెం.1 ని చెత్త కాగితం కన్నా అధ్వాన్నంగా చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ జీవో అమలుకు ఆయా స్కూళ్లల్లో ఏర్పాటవుతున్న పేరెంట్స్ కమిటీలు కూడా యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నాయనే టాక్ ఉంది.
ఫీజులు గానీ, అడ్మిషన్ పేరిట వసూలు చేసే ఛార్జీలు గానీ.. ఏవైనా కూడా పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆ మేరకు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారితో ఆమోదం పొందాలి. కచ్చితంగా వాటినే స్కూళ్ల యాజమాన్యాలు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు పాఠశాలల నిర్వాహకులు. అడ్మిషన్ ఫీజుల పేరిట ప్రైవేట్ స్కూళ్ల వసూళ్ల దందాపై నోరు విప్పే వారు కరువయ్యారు.
డిగ్రీ చదువులను మించిపోయాయిగా..!
డిగ్రీ చదువుల కన్నా ఎల్కెజి, యూకెజి చదువుల ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. అడ్మిషన్ ఛార్జీలు మొదలు ఏడాది ఫీజు.. అలాగే యూనిఫామ్స్, స్పోర్ట్స్ డ్రెస్, బూట్లు, సాక్సులు, బెల్ట్, టై, బ్యాడ్జ్, ఐడీ కార్డు అంటూ సవాలక్ష మెనూ కార్డుతో వేలకు వేలు గుంజుతున్నారు స్కూళ్ల నిర్వాహకులు. ఎల్కెజి, యూకెజి కోసమే 20 వేలకు పైగా ఫీజు.. అదనపు ఛార్జీల మోత మరో 10 వేలు.. దాదాపు 30 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది.
ఇక తరగతులు పెరిగిన కొద్దీ.. సంవత్సరాలు మారే కొద్దీ వసూలు చేసే ఫీజులు, ఛార్జీల్లో కూడా భారీ పెరుగుదల కనిపిస్తోంది. స్కూల్ పేరు చివరన టెక్నో, డీజీ అంటూ తోకలు తగలించుకుని.. ఆ వాయింపులు వేరేగా ఉంటుండటం గమనార్హం.
ఫీజులు సరే.. కనీస వసతులు ఏవి..?
వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నా.. కనీస వసతుల కల్పనలో చాలా స్కూళ్లు విఫలమవుతున్నాయి. తాగునీరు కూడా ఏర్పాటు చేయని పాఠశాలలు ఉండటం గమనార్హం. ఇక టాయిలెట్ల ఏర్పాటు విషయంలో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. 500 మంది విద్యార్థులున్న స్కూళ్లల్లో మూడు, నాలుగు టాయిలెట్లు మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మైదానాలు, పార్కింగ్ స్థలాలు లేని స్కూళ్లు వేల సంఖ్యలో ఉంటుండటం గమనార్హం. ఇక బోధనాంశాల్లో గానీ.. టీచర్ల విషయంలో గానీ నాణ్యతా ప్రమాణాలు పాటించని స్కూళ్లు లెక్కకు మించినన్ని ఉన్నాయనే ఆరోపణలున్నాయి. బీఎడ్ అర్హత లేని వారితో విద్యాబోధన చేయిస్తూ.. వారికి తక్కువ జీతాలిస్తూ తూతూ మంత్రంగా నడుస్తున్న స్కూళ్లకు కొదువే లేదు.
అయ్యో బాలయ్య.. నీ తిప్పలు ఏందయ్యా.. ఈసారి అల్లుడి దారి తొక్కారుగా..!
పట్టించుకునేవారు లేక.. విద్యాహక్కు చట్టానికి తూట్లు..!
విద్యాహక్కు చట్టం ప్రకారం.. అర్హత కలిగిన టీచర్లతోనే విద్యాబోధన చేయించాలి. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూళ్లల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం ఫ్రీగా సీట్లు ఇవ్వాలి. దానికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలి. స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు నడపడం నేరంగా పరిగణించాలి. ఇలాంటి ఎన్నో నిబంధనలున్నా.. అధికారుల అలసత్వంతో విద్యాహక్కు చట్టం నీరుగారిపోతుందనే వాదనలు లేకపోలేదు. మొత్తానికి స్కూళ్లు రీఓపెన్ అవుతున్న సందర్భంలో.. విద్యాశాఖ అధికారులు మేల్కొని పాఠశాలల ఫీజులుం పై కొరడా ఝలిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.