నవంబర్, డిసెంబర్ నెలల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా ? ఎస్ఈసి పార్ధసారధి ఏం చెప్పారంటే ...
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ స్పీడ్ పెంచింది . ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఎన్నికల పనుల్లో ఎలక్షన్ కమిషన్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి మొదటి వారంలో జిహెచ్ఎంసి టర్మ్ ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన సన్నాహాలు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ . ఇప్పటికే ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేసిన ఎన్నికల కమిషన్, ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ బాక్సులను తెప్పించింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలోనే .. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన
బ్యాలెట్ బాక్సులను తెప్పిస్తూ ... స్పీడ్ పెంచిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మంగళవారం సాయంత్రం వరకు 5700 బ్యాలెట్ బాక్స్ లు వచ్చినట్లుగా ఈసీ వర్గాలు వెల్లడించాయి . ఈ బాక్స్ లను చాదర్ ఘాట్ లోని విక్టరీ ప్లే గ్రౌండ్ లో భద్ర పరచినట్లుగా సమాచారం. మొత్తం జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణకు 40 వేల వరకు బ్యాలెట్ బాక్సులు అవసరం ఉండగా, ఎన్నికల కమిషన్ వాటిని సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది. కరోనా నేపథ్యంలో గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11500 నుండి 12 వేల వరకు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎస్ఈసి పార్ధసారధి .. నవంబర్ , డిసెంబర్ నెలల్లోనే ఎన్నికలకు ఛాన్స్
ఇదే సమయంలో నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లుగా స్పష్టం చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికలను సజావుగా నిర్వహించటం కోసం కమిషన్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు . సమయాన్ని బట్టి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని చర్యలు చేపడుతున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్నరాజకీయ పార్టీలు
మొత్తానికి అటు రాజకీయ పార్టీలు, ఇటు అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ జిహెచ్ఎంసి ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించడంతో రాజకీయ పార్టీలు స్పీడ్ ను పెంచే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల కోసం పావులు కదుపుతుంటే, ప్రతిపక్ష పార్టీలు సైతం రంగంలోకి దిగుతున్నాయి. ఈసీ మాత్రం త్వరితగతిని ఎన్నికలు నిర్వహించాలని దూకుడు పెంచింది.