హైదరాబాద్ లో 144 సెక్షన్: 24 గంటల పాటు: ఈ సారి ప్రత్యేకం..!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 144 సెక్షన్ ను విధించారు పోలీసులు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. బాబ్రీ మసీదును కూల్చివేసిన డిసెంబర్ 6వ తేదీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. డిసెంబర్ 6వ తేదీ నాడు బ్లాక్ డేగా జరుపుకొంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ఏటేటా 144 సెక్షన్ ను విధించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కొన్ని ప్రత్యేక కారణాలు చోటు చేసుకున్నాయి.
కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ఆరంభం: యడ్డీ సర్కార్ నిలబడాలంటే.. కనీసం ఏడు
Recommended Video
అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తమకు ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి పక్కా సమాచారం అందిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 144 సెక్షన్ ను విధించడంతో పాటు.. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలను భగ్నం చేయడానికి ప్రయత్నించే ఏ ఒక్కర్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘటనకు శుక్రవారం నాటితో 27 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత, రామమందిరం నిర్మాణం.. వంటి అంశాల్లో ఈ సారి డిసెంబర్ 6వ తేదీ.. ప్రత్యేకత సంతరించుకుంది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
వివాదాస్పద భూమి రామ్ లల్లా విరాజ్ మాన్ కు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, దీన్ని సవాలు చేస్తూ జమాతె ఉలేమా-ఇ-హింద్ రివ్యూ పిటీషన్ దాఖలు చేయడం వంటి సంఘటనలు తోడు కావడంతో ఇదివరకు ఎప్పుడూ లేని ప్రత్యేకత ఈ సారి డిసెంబర్ 6వ తేదీకి ఏర్పడింది. ముస్లిం సామాజిక వర్గం అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చే రోజు శుక్రవారం. శుక్రవారం పూట వారు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తుంటారు.
అదే రోజు బ్లాక్ డే రావడం కూడా 144 సెక్షన్ ను విధించడానికిి ఓ కారణమైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదు సహా పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల తరువాత 144 సెక్షన్ ను ఎత్తేస్తామని, ఈ మధ్యకాలంలో ఎవరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.